Kamareddy: ‘పది’ ప్రశ్నల లీకేజీలో 11 మందిపై కేసు
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:28 AM
పదో తరగతి పరీక్ష కేంద్రం నుంచి గణిత ప్రశ్నా పత్రంలోని కొన్ని ప్రశ్నలు లీక్ అయిన కేసును కామారెడ్డి పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు.

8 మంది అరెస్టు.. రిమాండ్కు తరలింపు
పరారీలో ముగ్గురు, వారినీ అరెస్టు చేస్తాం
కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర వెల్లడి
కామారెడ్డి, మార్చి 27(ఆంధ్రజ్యోతి) : పదో తరగతి పరీక్ష కేంద్రం నుంచి గణిత ప్రశ్నా పత్రంలోని కొన్ని ప్రశ్నలు లీక్ అయిన కేసును కామారెడ్డి పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. పలు ప్రశ్నలు బయటకు రావడానికి, అవి సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కారణమైన 11 మందిపై కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజే్షచంద్ర తెలిపారు. కామారెడ్డిలో గురువారం కేసు వివరాలను ఆయన వెల్లడించారు. జుక్కల్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థి బుధవారం జరిగిన గణితం పేపర్లో మంచి మార్కులు పొందేందుకు తన తండ్రి జాదవ్ సంజయ్ సహాయం కోరాడు. కాగితంపై కొన్ని ప్రశ్నలు రాయించుకొని వచ్చేలా అదే పాఠశాలలో పనిచేస్తున్న వాటర్మ్యాన్ సయ్యద్ ముబీన్తో సంజయ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
సంజయ్ చెప్పినట్లుగా 5 ప్రశ్నలను రాయించుకున్న ముబీన్.. బయటకు వచ్చి సంజయ్కు ఇచ్చాడు. అతని వద్ద ఉన్న కాగితాన్ని మనోజ్ అనే వ్యక్తి సెల్ఫోన్లో ఫొటోలు తీసి ఒకరికి వాట్సా్పలో షేర్ చేయగా.. ఆ తర్వాత అది సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ మేరకు సంజయ్, ముబీన్, మనోజ్ సహా పలువురిపై కేసు నమోదైంది. వీరిలో 8 మందిని అరెస్టు చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు.