OBC Reservations: ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:43 AM
దేశవ్యాప్తంగా విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. కేంద్రం చేపట్టే జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.

సామాజిక న్యాయ ఉద్యమాల్లో విద్యార్థులదే కీలకపాత్ర
ఏఐవోబీసీఎ్సఏ జాతీయ సదస్సులో వక్తలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. కేంద్రం చేపట్టే జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, బిహార్ బీసీ రిజర్వేషన్ల బిల్లులకు కేంద్రం రాజ్యాంగ రక్షణ కల్పించాలన్నారు. గురువారం, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో అఖిలభారత ఓబీసీ విద్యార్థుల సంఘం (ఏఐవోబీసీఎ్సఏ), బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్వర్యంలో ’కులగణన, ఓబీసీ రిజర్వేషన్లు, రాజ్యాంగ పరిరక్షణలు: సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కార్యచరణ’ అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై పోరాటం చేసేందుకు బీసీ సంఘాలకు ఇతర వర్గాలు కూడా సహకరించాలని కోరారు. మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రిజర్వేషన్ల సంరక్షణ, పెంపు కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
ఓబీసీల హక్కులను న్యాయపరమైన సవాళ్ల నుంచి రక్షించేందుకు బిహార్, తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లులను తమిళనాడు రిజర్వేషన్ల మాదిరిగా రాజ్యాంగ రక్షణ కల్పించడం అత్యవసరమని రాజ్యసభ ఎంపీ విల్సన్ అన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలు రాజకీయశక్తిగా బలపడి సామాజిక న్యాయాన్ని సాధించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీపీ మండల్ మనుమడు, ప్రొఫెసర్ సూరజ్ మండల్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయ ఉద్యమాల్లో విద్యార్థుల పాత్ర కీలకం అని విద్యార్థి ఉద్యమాలు ప్రపంచ చరిత్రలో అనేక సామాజిక మార్పులను తీసుకొచ్చాయని అన్నారు. సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడంలో మేధావుల పాత్ర ప్రధానం అని, పండితులు, పాలకులు, విద్యార్థులు ఓబీసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో పాలుపంచుకోవాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు సూచించారు. ఏఐవోబీసీఎ్సఏ జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఓబీసీల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు విద్యార్థి సంఘాలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
For More AP News and Telugu News