Hyderabad: జవహర్నగర్ పరిధిలో ఇళ్ల కూల్చివేత
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:37 AM
గ్రామాల్లో పనులు లేక పొట్ట చేత పట్టుకుని వలస వచ్చాం. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే చిన్న రేకుల షెడ్లు కట్టుకుని ఉంటున్నాం.

ప్రభుత్వ స్థలంలో నిర్మించారని చర్య
బిట్స్ పిలానీ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ‘‘గ్రామాల్లో పనులు లేక పొట్ట చేత పట్టుకుని వలస వచ్చాం. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే చిన్న రేకుల షెడ్లు కట్టుకుని ఉంటున్నాం. ప్రభుత్వానికి ఇంటి పన్ను కూడా కడుతున్నాం. మీకు దండం పెడతాం.. సారూ.. మా ఇళ్లను కూల్చొద్దు’’ అని హైదరా బాద్ శివారు జవహర్నగర్ పరిధిలోని పలు కాలనీల వాసులు రెవెన్యూ అధికారులను వేడుకున్నారు. కళ్లముందే ఇళ్లను కూలగొడుతుండటంతో యజమానులు అధికారులను అడ్డుకున్నారు.
దీంతో కార్పొరేషన్ పరిధిలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. కాప్రా మండలం జవహర్నగర్ పరిధిలోని అంబేడ్కర్నగర్, బీజేఆర్ నగర్, సంతో్షనగర్, లక్ష్మీ నరసింహస్వామి కమాన్ ఎదురుగా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఇళ్లు, ఇతర నిర్మాణాలను తహసీల్దార్ సుచరిత ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీంతో పండగ పూట చిన్న పిల్లలను తీసుకొని ఎక్కడికి వెళ్లాలని స్థానికులు అధికారులను ప్రశ్నించారు.