KPHB: గజం రూ.1.85 లక్షలు
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:33 AM
కూకట్పల్లి హౌసింగ్బోర్డులో శుక్రవారం టీజీహెచ్బీ వెస్ట్రన్ డివిజన్ పరిధిలో 23 స్థలాలకు వేలం వేయగా రోడ్ల వెంట 12 స్థలాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొత్తం 1696.62 గజాలను అమ్మగా రూ.25.63 కోట్లు వచ్చినట్లు తెలిసింది.

హైదరాబాద్ కేపీహెచ్బీలో ప్లాట్ల వేలం
ఉద్రిక్తతల మధ్య కొనసాగించిన అధికారులు
ఉదయం కోర్టు స్టే.. మధ్యాహ్నం గ్రీన్ సిగ్నల్
అమ్మకాలు ఖరారు చేయొద్దన్న హైకోర్టు
లేఅవుట్లో చూపెట్టకుండా మిగిలిన పాట్లుగా పేర్కొనడం తగదని స్పష్టీకరణ
కేపీహెచ్బీకాలనీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కూకట్పల్లి హౌసింగ్బోర్డులో శుక్రవారం టీజీహెచ్బీ వెస్ట్రన్ డివిజన్ పరిధిలో 23 స్థలాలకు వేలం వేయగా రోడ్ల వెంట 12 స్థలాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొత్తం 1696.62 గజాలను అమ్మగా రూ.25.63 కోట్లు వచ్చినట్లు తెలిసింది. ఒకింత ఉద్రిక్తత మధ్యే వేలం కొనసాగింది. వేలం ఆపాలని కేపీహెచ్బీ 15వ ఫేజ్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించడంతో ఉదయం 11.30 గంటలకు జరగాల్సిన వేలానికి బ్రేక్ పడింది. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత అదే కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వేలం జరిగింది. జీవో నంబరు-6 ప్రకారం 100 గజాలలోపు ఉన్న స్థలాలు పక్క వారికే ఇవ్వాలని, వేలం వేయడానికి లేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాకపోతే ఇక్కడ లబ్ధిదారుడు అయితే వేలం ప్రక్రియ ఆగేదేమో కానీ అసోసియేషన్కు ఏం సంబంధం అంటూ కోర్టు కొట్టేసినట్లు తెలిసింది. కాగా వేలంలో 15వ ఫేజ్లోని రోడ్ల వెంట ఉన్న స్థలాలు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.
అక్కడ గజం 1.25లక్షలుగా అధికారులు నిర్ణయించగా 33.33 గజాలు, 200 గజాల బిట్లకు.. గజం రూ.1.85లక్షల చొప్పున, 110 గజాలను గజం రూ.1.80లక్షల చొప్పున, 206.66 గజాలను రూ.1.70లక్షల చొప్పున, 66.66, 190 గజాలను రూ.1.55లక్షల చొప్పున, 160 గజాలను రూ.1.45లక్షల చొప్పున, 272.22 గజాలను రూ.1.35లక్షల చొప్పున సొంతం చేసుకున్నారు. ఐదో ఫేజ్లో.. 136.27 గజాలను రూ.1.45లక్షల చొప్పున వేలంలో దక్కించుకున్నారు. ఏడో ఫేజ్లో.. 146.66 గజాలను 1.20లక్షల చొప్పున, 78.82 గజాలను రూ.1.05లక్షల చొప్పున దక్కించుకున్నారు. తొమ్మిదో ఫేజ్లో 99గజాలను రూ.1.10లక్షల చొప్పున వేలంలో సొంతం చేసుకున్నారు. వేలంలో స్థలాలను దక్కించుకున్న వారు ఈనెల 27వ తేదీలోపు పాడుకున్న మొత్తంలో కనీసం 25శాతం హౌసింగ్బోర్డుకు చెల్లించాలని చెప్పారు. మిగతాది ఎప్పుడు అనేది కోర్టు నిర్ణయించిన తర్వాత చెబుతామని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం