దరిచేరని లక్ష్యం
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:17 PM
వాహనాల పన్నుల వసూళ్లపై ఆర్టీవో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ వసూళ్లలో వెనకబడ్డారు.

- గద్వాల జిల్లా ఆర్టీవోలో పేరుకుపోయిన బకాయిలు
- లక్ష్యం రూ.50.76కోట్లు.. వసూలైంది రూ.41.86కోట్లు
- బార్డర్ చెక్పోస్టులలో పెరిగిన వాహనాల సంఖ్య
- అయినా పెరగని ఆదాయం
గద్వాల, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): వాహనాల పన్నుల వసూళ్లపై ఆర్టీవో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ వసూళ్లలో వెనకబడ్డారు. జిల్లాకు రూ.50.76కోట్ల లక్ష్యం ఉండగా రూ. 41.86 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. గతేడాది 93.95 శాతం తో అన్ని రకాల పన్నులు వసూలు కాగా ఈ ఏడాది 82.53 శాతం మా త్రమే వసూలు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బార్డర్లో వాహనాల సంఖ్య పెరిగినప్పటికీ ఆదాయం మాత్రం అనుకున్న స్థాయిలో రాబట్ట లేకపోయారు.
ఆదాయం రావాల్సింది ఇలా..?
జిల్లాలో ప్రస్తుతం 1,46,239 వాహనాలు ఉన్నాయి. ఇందులో రవాణశాఖకు అధిక మొత్తంలో పన్నులు చెల్లించే ట్రాక్టర్లు, మ్యాక్సీ క్యాబ్లు, గూడ్స్ వాహనాలు, స్కూల్ బస్సులు, లారీలు, హార్వెస్టర్లు, ఆటోరిక్షాలు, మో టార్ క్యాబ్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతీ ఏటా రూ.9.44కోట్ల పన్ను వసూ లు కావాలి, కానీ రూ.8.24కోట్లు మా త్రమే వసూలు అయ్యింది. ఇంకా దాదాపు రూ.1.19కోట్లు బకాయి ఉంది. ప్రతీ ఏటా కొత్తవాహనాల రిజిస్ట్రేషన్ తో పాటు పాత వాహనాల రెన్యువల్ ద్వారా రూ.26.04 కోట్లు లైఫ్ ట్యాక్స్ వసూలు కావాలి. కానీ ఈ ఏడాది రూ.19.91కోట్లు మాత్రమే వసూలు అయ్యింది. ఇవి కాకుండా అనుమతులు లేకుండా రోడ్డుపై తిరిగే వాహనాలను తనిఖీ చేసి కేసులు నమోదు చేయడం ద్వారా రూ.7.44కోట్లు ఆదా యం రావాల్సి ఉండగా రూ.6.63 కోట్లు మాత్రమే వచ్చింది. గ్రీన్ ట్యాక్స్ రూ.48లక్షలు వసూలు కావాల్సి ఉం డగా రూ.38లక్షలు మాత్రమే వసూలు చేశారు.
జాతీయ రహదారిపై జల్లాపురం వద్ద చెక్పోస్టు ఉంది. దీని ద్వారా ప్రతీ ఏడాది బారీగానే ఆదాయం సమకూరుతోంది. ప్రతీ ఏడాది బార్డర్ దాటే వాహనాల సంఖ్య పెరుగుతోం ది. అదే స్థాయిలో చెక్చేసే వాహనాల సంఖ్య పెరిగినప్పటికీ ఈ ఏడాది ఆదాయం తగ్గింది. గతేడాది 35,235 వాహనాలను చెక్ చేయగా రూ. 9.03 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది 59,831 వాహనాలను చెక్ చే యగా రూ.9.98కోట్ల ఆదాయం వచ్చిం ది. గత ఏడాది కంటే రూ.95లక్షలు అధికంగా ఉన్నప్పటికీ చెక్ చేసిన వాహనాల సంఖ్య కూడా రెట్టింపుగా ఉంది. దీని వలన ఆదాయం పెరగాల్సి ఉంది. అయితే కాంట్రాక్ట్ క్యారేజీ పర్మిట్ బస్సులు, వన్ నేషన్ వన్ పర్మిట్ను ఈ ఏడాది నుంచి అమలు చేయడంతో సీసీ బస్సులు వారికి అనుకూలమైన రాష్ర్టాలలో పన్నులు చెల్లించాయని, దాని వలన ఆదాయం తగ్గిందని రవాణశాఖ అధికారులు అంటున్నారు.