భూగర్భ జలాలు సంరక్షించుకోవాలి
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:21 PM
భూగర్భ జలాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు.

- అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
నారాయణపేట టౌన్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశమందిరంలో ప్రపంచ జన వనరుల దినోత్సవం సందర్భంగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలకు నిర్వహించిన వర్క్షాప్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. నిత్య జీవితంలో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుందని, భూగర్భ జలాలు తగ్గడంతో పంటలు ఎండిపోతాయని, తాగునీటి సమస్య వస్తుందని తెలిపారు. ఇష్టారాజ్యంగా జల వనరులు, భూగర్భ జలాల సంరక్షణ నిబంధనలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవో లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. నీటి సంరక్షణ పద్ధతులపై దృష్టి పెట్టి అవగాహన కల్పించాలన్నారు. నీటి వృథాను అరికట్టాలని, వర్షపునీటి సంరక్షణ స్ట్రక్టర్లు నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా నాటిన మొక్కలు సంరక్షించాలని, ప్రతీ సంవత్సరం పాఠశాలల్లో న్యూ ట్రీగార్డెన్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో ల్యాండ్ స్కేపింగ్తో పచ్చదనం పెంపొందించేలా మొక్కలు పెంచాలన్నారు. మంచి గార్డెన్, గ్రీనరి పెంపునకు కృషి చేసిన అధికారులకు అవార్డులు అం దించనున్నట్లు తెలిపారు. జడ్పీ సీఈవో భాగ్య లక్ష్మి, భూగర్భ జల వనరుల శాఖ డీడీ రమాదేవి మాట్లాడారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో జయసుధ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్సుధాకర్, మిషన్ భగీరథ ఈఈ రంగారావు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.