బడి బాగెప్పుడో..?
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:57 PM
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కలగానే మారుతోంది.

- అసంపూర్తిగా మిగిలిన అమ్మ ఆదర్శ పాఠశాల పనులు
- మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
- చేసిన పనులకు బిల్లులు రాక లబోదిబోమంటున్న కాంట్రాక్టర్లు
నాగర్కర్నూల్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కలగానే మారుతోంది. తాగునీరు, టాయిలెట్లు, ప్రహారీ, విద్యుత్ సౌకర్యం లాంటి అంశాలు కొలిక్కి రావడం లేదు. దీంతో సర్కార్ విద్యను ప్రోత్సహించే లక్ష్యం నీరుగారుతోంది. ప్రభు త్వాలు మారినప్పుడల్లా ప్రాధాన్యతల్లో తేడా లు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతోంది. గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకుండా ఆదరాబాదరగా టెండర్లు పిలిచి ‘మన ఊరు-మన బడి’ పను లను అట్టహాసంగా ప్రారంభించింది. అప్పటి విద్యాశాఖ మంత్రి ఈ పథకానికి నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం మేడిపూర్ లో శ్రీకారం చుట్టారు. ‘మన ఊరు-మన బడి’ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో తాగు నీరు, విద్యుత్ సౌకర్యం, ప్రహారీ, మరు గుదొడ్లు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనేది ప్రధాన ఉద్దేశం. టాయిలెట్లు, కిచెన్షెడ్లు, ప్రహారీ నిర్మాణం ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద చేపట్టాలని నిర్ణయించారు. ఏడాదిలో గా పనులు పూర్తి చేయాలని మూడేళ్ల క్రి తం ఈ పథకం ప్రారంభమై నప్పుడు అప్ప టి ప్రభుత్వం భావించింది. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
బిల్లులు పెండింగ్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మన ఊరు మన బడిలో చేసిన పనులకు కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అదనపు తరగతి గదుల నిర్మాణం, మరమ్మతు పనులు, తాగునీటి సదుపాయం కల్పించడా నికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బిల్లులు రాక సంబంధిత కాంట్రాక్టర్లు లబోదిబోమంటు న్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో 816 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 290 పాఠశా లలు ‘మన ఊరు-మన బడి’ కింద ఎంపిక య్యాయి. వాటి మరమ్మతుకు రూ.89కోట్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు కేవలం 105 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్త య్యాయి. 169 పాఠశాలల్లో పనుల పురోగతి మందకొడిగా కొనసాగుతుండగా 16 పాఠశాల ల్లో పనులే ప్రారంభించలేదు. పనులు పూర్తి చేసిన వారికి రూ.18కోట్ల 32లక్షలు కాంట్రాక్ట ర్లకు చెల్లించగా రూ.10 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు అసంపూర్తిగా వదిలేసినా ఇప్పటి వరకు ఎలాంటి మానిటరింగ్ లేదు. వనపర్తి జిల్లాలో 518 పాఠశాలలు ఉండగా 183 పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ కింద పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందు కోసం దాదాపు రూ.80 కోట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు కేవలం 96చోట్ల పనులు పూర్తి చేశారు. 87 పాఠశాలల్లో పనులు అసంపూర్తి గా ఉన్నాయి.