Pongulati: త్వరలో సర్వేయర్లు, గ్రామాధికారుల నియామకం
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:15 AM
రాష్ట్రంలో సర్వేయర్లు, గ్రామాధికారుల నియామకాలను త్వరలో చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం విధివిధానాలను తక్షణమే రూపొందించి, ఎంపిక, పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సర్వేయర్లు, గ్రామాధికారుల నియామకాలను త్వరలో చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం విధివిధానాలను తక్షణమే రూపొందించి, ఎంపిక, పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ, సర్వేయర్ల నియామకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు తదితర అంశాలపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారికి పరీక్ష నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 450 మంది సర్వేయర్లు ఉన్నారని, అదనంగా మరో 1000 మంది సర్వేయర్ల అవసరం ఉందన్నారు. అందుకు అవసరమైన ఎంపిక ప్రక్రియకు ప్రణాళికలు రూపొందించాలని, ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులతో కూడిన జాబితాలను గ్రామసభల్లో పెట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేయాలని సూచించారు.