Sarala : నా భర్తది ముమ్మాటికి రాజకీయ హత్యే
ABN , Publish Date - Mar 20 , 2025 | 05:28 AM
తన భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, ఈ ఘటనలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిల ప్రమేయం ఉందని ఇటీవల హత్యకు గురైన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగ మూర్తి భార్య సరళ ఆరోపించారు.

కేసీఆర్, కేటీఆర్, హరీశ్, గండ్ర ప్రమేయం
నాగవెళ్లి రాజలింగ మూర్తి భార్య సరళ
కృష్ణకాలనీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): తన భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, ఈ ఘటనలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిల ప్రమేయం ఉందని ఇటీవల హత్యకు గురైన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగ మూర్తి భార్య సరళ ఆరోపించారు. బుధవారం భూపాలపల్లి ప్రెస్క్లబ్లో ఆమె మాట్లాడారు. తన భర్త పలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకున్నారని, అతను అలా చేయకపోతే ఒక్క ప్రభుత్వ భూమి కూడా మిగిలేది కాదని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ప్రజాధనం వృథా అయిందని ప్రజల తరుపున కేసు వేశారని చెప్పారు.
ఈ క్రమంలో ఇలాంటి వ్యక్తి ఉంటే భూ కబ్జాలకు అవకాశం ఉండదని, ప్రశ్నించే గొంతులను చంపేయాలనే కుట్రతోనే హత్య చేశారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. తన భర్త హత్య కేసును సీబీ సీఐడీతో విచారణ జరిపించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.