Chandrababu: వైసీపీలో భయం!

ABN , First Publish Date - 2022-12-02T03:05:23+05:30 IST

తన పర్యటనలు చూసి 2014 పరాజయం రిపీట్‌ అవుతుందని వైసీపీకి భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

Chandrababu: వైసీపీలో భయం!

2014 రిపీట్‌ అవుతుందని

ఆ పార్టీకి ఎక్స్‌పైరీ డేట్‌ వచ్చేసింది.. పొట్ట కొట్టుడు-డబ్బు నొక్కుడు.. ఇదే జగన్‌ స్టైల్‌

పోలీసులతో బెదిరింపులు.. పరదాల మాటున టూర్లు

రఘురామను కొట్టించి జగన్‌ పైశాచిక ఆనందం

భయపడితే చంపేస్తారు.. స్వాతంత్య్ర యోధుల్లా పోరాడండి

మీమీద కేసులు పెడితే నేనున్నా.. బాధపెట్టే వాళ్లను వదలను

నా మంచితనమే చూశారు.. ఇక నా కఠినత్వం చూపిస్తా

ఎన్టీఆర్‌ పేరు మారుస్తారా?.. తల్చుకుంటే కడప పేరు మార్చగలను

కానీ మాకు సంస్కారం ఉంది.. బీసీలు రాజకీయంగా ఎదగాలి

మేమొస్తే గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10-20ు

చంద్రబాబు ప్రకటన.. ఏలూరు, ‘తూర్పు’ జిల్లాల్లో పర్యటన

ఏలూరు/రాజమహేంద్రవరం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): తన పర్యటనలు చూసి 2014 పరాజయం రిపీట్‌ అవుతుందని వైసీపీకి భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ‘ప్రజల పొట్ట కొట్టడం.. బటన్‌ నొక్కి డబ్బులు నొక్కేయడం.. ఇదీ జగన్‌ స్టైల్‌. ఈయన పార్టీకి ఎక్స్‌పైరీ డేట్‌ వచ్చేసింది. పాత పథకాలకు నీ పేర్లు పెట్టినంత మాత్రాన నీ సొంత పథకాలు అయిపోవు’ అని స్పష్టం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జంగారెడ్డిగూడెంలో రెండో రోజు గురువారం స్థానిక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కొయ్యలగూడెం సెంటర్‌లో, పోలవరంలో, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరించడం, పరదాల మాటున దాక్కుని తిరగడం జగన్‌కు అలవాటైంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులతో చితకబాదించి పైశాచిక ఆనందం పొందారు. ఎవరైనా చనిపోయారంటే సైకో నవ్వులు నవ్వుతుంటావు. దీనిని బట్టి చెప్పేయొచ్చు నీ మనస్తత్వం ఏమిటో’ అని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..

ఉయ్యాల రోడ్ల దెబ్బకు నడుం నొప్పి..

40 ఏళ్ల నా అనుభవంలో ఎన్నో యాత్రలు చేశాను. కానీ నిన్న ఏలూరు నుంచి చింతలపూడికి వచ్చేసరికి ఈ ఉయ్యాల రోడ్ల దెబ్బకు నాకు నడుం నొప్పి వచ్చేసింది. ఇవన్నీ భరిస్తున్న మీ సహనానికి జోహార్లు. 30 లక్షల ఇళ్లు కడతానన్నాడు. కట్టాడా తమ్ముళ్లూ? అదే నేను కట్టిన టిడ్కో ఇళ్లు చూస్తే నా ముందు చూపు ఏంటో తెలుస్తుంది. నేను వస్తే మీకు ఆస్తులు కల్పిస్తా. మీ అందరికీ సొంతిళ్లు ఉండేలా చేస్తా. జగన్‌ మందు తాగి 29 మంది చనిపోయారు. జనం మందు తాగుతున్నారా.. విషం తాగుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. బూం బూం బీరంట. నాకు అలవాటు లేదు. ఎప్పుడూ తాగను కాబట్టి నాకు తెలియదు. కానీ ఆ కొత్త బ్రాండ్లు ఏంటో తాగుతున్న మీకైనా తెలియాలిగా తమ్ముళ్లూ!

జగన్‌ భరతం పడదాం

భయపడకండి.. భయపడితే చంపేస్తారు. స్వాతం త్య్ర సమరమోధుల్లా పోరాడండి. మీమీద కేసులుపెడితే నేను చూసుకుంటాను. సిద్ధంకండి తమ్ముళ్లూ.. జగన్‌ భరతం పడదాం. ఇది ఒక ఉద్యమంలా మారాలి. ఇన్నాళ్లూ నా మంచితనమే చూశారు. ఇక నా కఠినత్వం చూస్తారు. బాధపెడుతున్నవారెవరినీ వదలను. ఇక వైసీపీకి ఓటేయబోమని ఇంటికి వచ్చిన వారికి చెప్పండి. సెల్‌ఫోన్లను ఉపయోగించండి. మీ ఊరిలో, మీ వీధిలో మీ ప్రాంతంలో ప్రతి సమస్యను ఫొటోలు తీసి వాట్సా్‌పలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అని అందరికీ మెసేజ్‌లు పంపించండి. ఐరన్‌లెగ్‌ జగన్‌ వచ్చాడు. పోలవరంలో అడుగుపెట్టాడు. అంతా మటాష్‌. చిన్న బిడ్డను పెంచినట్లు పోలవరాన్ని నిర్మించాను. ఈ పోలవరానికి ఇదేం ఖర్మ.. గోదాట్లో ముంచేశాడు. పూర్తయివుంటే అటు శ్రీకాకుళం, ఇటు కర్నూలు వరకు నదులు అనుసంధానం చేసి ఉంటే రాష్ట్రమంతా సస్యశ్యామలమయ్యేది. ఇవాళ 41.5 అడుగులకు తగ్గించి పోలవరాన్ని బ్యారేజ్‌లా కడతాడట. జగన్‌ నలుపు చూస్తే భయపడిపోతున్నాడు. నల్ల గొడుగు చూస్తే భయం. నల్ల కోటు చూస్తే భయం. చివరకు అమ్మాయిలు నల్ల చున్నీలు వేసుకున్న భయపడుతున్నాడు. నరసాపురం సభలో ఆడబిడ్డల చున్నీలు లాగేశారు. ఏమిటయ్యా ఇదీ.

కులం పేరుతో చంపేశాడు..

అమరావతి రైతులు 39వేల ఎకరాల భూమి ఇచ్చారు. ఇవాళ రూ.3 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది. అప్పులు అవసరం ఉండేది కాదు. కానీ ఈ జగన్‌ కులం పేరుతో రైతులను చంపేశాడు. తన కులం వారినే అధికారులుగా నియమిస్తున్నాడు. విజయసాయిరెడ్డిల, సజ్జల, పెద్దిరెడ్డి వంటి వారికే పెత్తనం అప్పగించాడు. వాళ్లేనా మగాళ్లు.. ఇంకేవ్వరు లేరా..? మొత్తం పదవులన్నీ వారికేనా? నేను 50 శాతం మంది బీసీలకు పదవులు ఇచ్చాను. తిరిగి అధికారంలోకి వస్తే అన్ని సంక్షేమ పథకాలనూ అమలుచేస్తాం. గతంలోని పథకాలన్నీ పునరుద్ధరిస్తాం.నలుగురికీ అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను తీసేసి సైకోలా ప్రవర్తించాడు. మేం రాగానే తిరిగి వాటిని ప్రారంభిస్తాం. సైకో జగన్‌ బటన్‌ నొక్కుతాడు. కానీ డబ్బులు వేయడు. ప్రతి రోజూ సాయంకాలం బటన్‌ నొక్కుతాడు. అతడి ఇంటి గేట్లు తెరచుకుంటాయి. మద్యం, మైనింగ్‌, ఇసుక డబ్బులన్నీ వచ్చేస్తాయి. ప్రజల మెడపై కత్తిపెట్టి ఆస్తులు రాయించుకుపోతాడు. మనం అడిగితే పోలీసులు గోడలు దూకి వచ్చి మనల్ని జైలుకు పంపిస్తారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి. ఈ పాలన వద్దు.

పేర్లు మార్చుకోవడం గొప్పా...?

1983లోనే ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన రేషన్‌ బియ్యంకు పేరు మార్చారు. పింఛన్లు, చివరికి యూనివర్సిటీలకు పేర్లు మార్చుకుని ఈ జగన్‌ ఆనందిస్తున్నాడు. పేర్లు మార్చుకున్నంత మాత్రాన అవి మీ సొంతమైపోవు. ఎన్టీఆర్‌ యూనివర్సిటీ పేరు మార్చుకున్నావు. నేను అధికారంలోకి వచ్చాక కడప జిల్లా పేరు మార్చేయగలను. కానీ మాకు సంస్కారం ఉంది. టీటీడీలో 37 మంది సభ్యులకు గాను 50 శాతం రిజర్వేషన్‌ ఉంటే కేవలం ముగ్గురు బీసీలకిచ్చి చేతులు దులుపుకొన్నావు. 12కి గాను 10 యూనివర్సిటీలను మీ వర్గానికే కట్టబెట్టావు. దమ్ముంటే బహిరంగ చర్చకు రండి. ఎవరేం చేశారో నిరూపిస్తాం. బీసీలు తలచుకుంటే వైసీపీని బంగాళఖాతంలో కలిపేస్తారు జాగ్రత్త. గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10-20 శాతం అవకాశం కల్పిస్తాం. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించినప్పుడే సమాజంలో గుర్తింపు దక్కుతుంది. నేనే నేరుగా వచ్చి మీలోని నాయకుడిని వెలికి తీస్తాను. 8, 9, 10ల్లో గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చంద్రబాబు ఈ నెల 8, 9, 10తేదీల్లో గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు.

Updated Date - 2022-12-02T07:11:25+05:30 IST