Share News

Amaravati: మంత్రి అంబటి వ్యంగ్య ట్వీట్.. అయ్యన్న కౌంటర్..

ABN , Publish Date - Dec 18 , 2023 | 08:46 AM

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్ళిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్య ట్వీట్ చేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. మంత్రి అంబటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Amaravati: మంత్రి అంబటి వ్యంగ్య ట్వీట్.. అయ్యన్న కౌంటర్..

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్ళిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్య ట్వీట్ చేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. మంత్రి అంబటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘అంబటికు సీట్ పోయింది... ట్వీట్ మిగిలింది’ అయ్యయ్యో అంబటి.. అంటూ కౌంటర్ ఇచ్చారు.

కాగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో ఆదివారమిక్కడ భేటీ అయ్యారు. ఏపీలో మార్చిలోనే ఎన్నికలు జరగొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్నికల సన్నద్ధత, సీట్ల సర్దుబాటుపై సమీక్షించారు. ఉమ్మడి మేనిఫెస్టో, కలిసి బహిరంగసభల నిర్వహణ, ఉభయుల పొత్తు బలోపేతం, ఎన్నికల వ్యూహరచనపై చర్చించారు. ఈ రెండు పార్టీలూ కలిసే ఎన్నికల్లో పోటీచేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీల అగ్రనేతలు తరచూ భేటీ అవుతున్నారు. పవన్‌ కొద్దిరోజుల కిందట చంద్రబాబు నివాసానికి వెళ్లగా.. టీడీపీ అధినేత ఆదివారం రాత్రి మాదాపూర్‌లోని పవన్‌ నివాసానికి వెళ్లారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన జనసేనాని నివాసానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఆయనకు పవన్‌ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు జరిగాయి. ఏపీలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంపై సమీక్షించారు. చంద్రబాబు, పవన్‌ ఫొటోలతో ముద్రించిన ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు సమాచారం. ఎప్పుడు దీనిని విడుదల చేస్తారో త్వరలోనే తేదీని ఖరారు చేయనున్నారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో మహానాడులో టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీనికి జనసేన మరికొన్ని అంశాలు జోడించి మొత్తం 10 అంశాలతో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లనున్నాయి. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి సంబంధించి జనసేన కొన్ని సూచనలు చేసింది. కాగా.. తన కార్యక్రమాల షెడ్యూల్‌ ముందుగానే ఖరారు కావడంతో.. ఈ నెల 20న విశాఖలో జరిగే యువగళం ముగింపు సభకు హాజరుకాలేకపోతున్నానని పవన్‌.. చంద్రబాబుకు తెలిపినట్లు జనసేన వర్గాలు పేర్కొన్నాయి. ఈ భేటీలో జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా పాల్గొన్నారు. సమావేశ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘అధినేతల భేటీ చాలా సంతృప్తికరంగా సాగింది. అనేక అంశాలపై చర్చలు సుహృద్భావంగా జరిగాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికల్లో సమష్టిగా ఎలా ముందుకెళ్లాలి.. ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం.. రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ఎలా ముందుకు సాగాలో సమష్టి కార్యాచరణ తీసుకున్నాం. భావి రాజకీయ కార్యాచరణ, ఎన్నికల యాక్షన్‌ ప్లాన్‌పై చర్చించాం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధినేతలు పూర్తిస్థాయిలో చర్చించారు. పాలక వైసీపీని దీటుగా ఎదుర్కోవడమే గాక.. ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ విముక్త రాష్ట్రం చేసేందుకు అవసరమైన అన్ని అంశాలపై మాట్లాడుకున్నారు. భేటీలో చర్చకు వచ్చిన ఇతర కీలక అంశాల గురించి తర్వాత ప్రత్యేక మాట్లాడతాం’ అని వివరించారు.

బాబు సీఎం కావాలంటూ నిప్పుల గుండంలో నడక

రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండి తిరిగి రాష్ర్టానికి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ భవానీ మాలాధారణ చేసిన సబ్బినేని కిషోర్‌చౌదరి నిప్పుల గుండంలో నడిచారు. బాపట్ల ఎల్‌ఐసీ కార్యాలయ సమీపంలో భవానీ మాతకు అభిషేకాలు, పడిపూజ, నిప్పుల గుండం కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ పాల్గొని కనకదుర్గమ్మకు క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం నిప్పుల గుండం కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.

Updated Date - Dec 18 , 2023 | 08:46 AM