Lokesh: వలంటీర్లను కొనసాగిస్తాం

ABN , First Publish Date - 2023-04-25T02:47:45+05:30 IST

‘టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని ఏనాడూ చెప్పలేదు. వాటిని పంచాయతీలకు అనుసంధానం చేసి పల్లె సీమలను ప్రగతి పథంలో నడిపిస్తాం’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Lokesh: వలంటీర్లను కొనసాగిస్తాం

గ్రామ, వార్డు సచివాలయాలను పంచాయతీలకు అనుసంధానం చేస్తాం

వాటర్‌గ్రిడ్‌ ద్వారా 24 గంటలూ తాగునీరు.. పల్లెసీమలను ప్రగతి పథంలో నడిపిస్తాం

నేరుగా పంచాయతీ ఖాతాలకే నిధులిస్తాం.. సర్పంచుల గౌరవ వేతనం పెంచుతాం

‘పల్లె ప్రగతి కోసం మీ లోకేశ్‌’ కార్యక్రమంలో సర్పంచులకు హామీలు

79వ రోజు కొనసాగిన ‘యువగళం’ పాదయాత్ర

కర్నూలు ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ‘‘టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని ఏనాడూ చెప్పలేదు. వాటిని పంచాయతీలకు అనుసంధానం చేసి పల్లె సీమలను ప్రగతి పథంలో నడిపిస్తాం’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా 79వ రోజు సోమవారం ఆదోని నియోజకవర్గం పెద్దతుంబళం క్రాస్‌ వద్ద సర్పంచులతో నిర్వహించిన ‘పల్లె ప్రగతి కోసం మీ లోకేశ్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సర్పంచులు హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి సర్పంచులు అడిగిన పలు ప్రశ్నలకు లోకేశ్‌ సమాధానం ఇచ్చారు. గ్రామీణాభివృద్ధికి టీడీపీ ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో వివరించారు. పట్టణాలకు దీటుగా పల్లె సీమలను అభివృద్ధి చేస్తామని, ప్రణాళికాబద్ధంగా తాగునీరు, వీధి దీపాలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం, గ్రీన్‌ అంబాసిడర్‌ వంటి కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తామన్నారు. ‘‘ఒక్క ఏడాది ఓపిక పట్టండి, మీరందరూ కోరుకుంటున్న మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది.

మన నేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పల్లె సీమల్లో స్వర్ణయుగం తీసుకువస్తాం’’ అని లోకేశ్‌ అన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఎమ్మెల్యేలు సమష్టిగా పనిచేస్తే గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమని తెలిపారు. ‘‘ఈ సైకో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఎమ్మెల్యేలు సైతం దిష్టిబొమ్మలుగా మారారు. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. ఈ విధానం మారాలంటే సచివాలయ వ్యవస్థను పంచాయతీలకు అనుసంధానం చేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను పంచాయతీ ఖాతాల్లోకి మళ్లిస్తాం’’ అని వివరించారు.

పైసా కూడా దారిమళ్లనివ్వం!

కేంద్రం ఇచ్చే ప్రతి పైసాను ఎక్కడా దారి మళ్లించకుండా పంచాయతీలకే జమ చేస్తామని లోకేశ్‌ తెలిపారు. టీడీపీ పాలనలో ఎన్జీవోల(స్వచ్ఛంద సంస్థలు)తో కలిసి స్మార్ట్‌ వార్డు, స్మార్ట్‌ విలేజ్‌ చేపట్టామన్నారు. దీనిని సీఎం జగన్‌ తుంగలో తొక్కారని విమర్శించారు. నదుల అనుసంధానం ద్వారా సాగు నీరు అందిస్తామన్నారు. ‘‘గత ప్రభుత్వంలో నేను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశా. పల్లెసీమల్లో తాగునీటి కష్టాలు తీర్చాలని వాటర్‌గ్రిడ్‌కు రూపకల్పన చేశాం. ఈ ప్రభుత్వం వచ్చాక దానినీ వదిలేసింది. టీడీపీ రాగానే వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా ప్రతిపల్లెకు 24 గంటలూ తాగునీరు, ఇంటింటికీ కొళాయి ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తాం’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

సర్పంచుల పరిస్థితి దయనీయం

జగన్‌ పాలనలో సర్పంచుల పరిస్థితి దయనీయంగా మారిందని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీల్లో నిధుల్లేక.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక.. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించడంతో సర్పంచులు దీనస్థితిలో ఉన్నారని అన్నారు. ఒక్క ఏడాది ఆగితే టీడీపీ అధికారంలోకి వస్తుందని, నిధులు ఇవ్వడమే కాకుండా సర్పంచుల గౌరవాన్ని, గౌరవ వేతనాన్ని పెంచుతామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మేజర్‌ పంచాయతీల అభివృద్ధికి ఇతర రాష్ట్రాల్లో ప్రణాళికలను అధ్యయనం చేసి అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం జిల్లాకు చెందిన సర్పంచ్‌ లక్ష్మి ముత్యాలరావు అనుసంధాన కర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు బాబూ రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ మంత్రులు భూమా అఖిలప్రియ, అమర్నాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-04-25T02:47:45+05:30 IST