బీటెక్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 16 వేల మంది ఫెయిల్‌! బయటపడ్డ కాలేజీల డొల్లతనం!

ABN , First Publish Date - 2023-05-31T11:40:23+05:30 IST

రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల పనితీరు అంతంతమాత్రంగా ఉంది. భారీ భవంతులు, హంగులు తప్పితే విద్యార్థులకు తగిన విద్య

బీటెక్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 16 వేల మంది ఫెయిల్‌! బయటపడ్డ కాలేజీల డొల్లతనం!
first year exams

బయటపడ్డ జేఎన్‌టీయూ అఫిలియేటెడ్‌ కాలేజీల డొల్లతనం

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల పనితీరు అంతంతమాత్రంగా ఉంది. భారీ భవంతులు, హంగులు తప్పితే విద్యార్థులకు తగిన విద్య దొరకడం లేదు. జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ) ఇటీవల విడుదల చేసిన బీటెక్‌ ఫస్టియిర్‌ మొదటి సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలే ఇందుకు నిదర్శనం. అనుబంధ, అఫిలియేటెడ్‌ కళాశాలలకు సంబంధించి శనివారం వెలువడిన ఫలితాల్లో.. దాదాపు 16 వేల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మొత్తం 25,198 మంది పరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా కేవలం 9,198 మంది విద్యార్థులే అన్ని సబ్జెక్టుల్లో పాసయ్యారు. 16వేల మంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పేపర్లలో ఫెయిలై పరీక్షలు తప్పారు. మొత్తంగా ఉత్తీర్ణత శాతం కేవలం 37.40 మాత్రమే. ఈ ఫలితాలను చూసిన విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల్లో అర్హత కలిగిన, సరిపడా సంఖ్యలో అధ్యాపకులు లేకపోవడమే ఇలాంటి ఫలితాలు రావడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. 50 శాతం కంటే ఎక్కువ కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఉన్నట్టు సమాచారం. నిజానికి, అఫిలియేషన్‌ రెన్యువల్‌ కోసం జేఎన్‌టీయూ అధికారులు ప్రైవేటు కాలేజీల్లో ప్రతీ యేటా తనిఖీలు చేస్తుంటారు. అధ్యాపకులు, వసతులు అన్నింటిని పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇస్తారు. అయితే, జేఎన్‌టీయూ అధికారుల బృందం తనిఖీలకు వచ్చినప్పుడు.. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు డమ్మీ ఫ్యాకల్టీని చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాక, నిబంధనల మేరకు వేతనాలు చెల్లించలేక చాలా యాజమాన్యాలు అధ్యాపకుల సంఖ్యను గుట్టుగా తగ్గించేస్తున్నాయి. దీంతో అధ్యాపకులు లేక విద్యా బోధన అస్తవ్యస్తంగా మారి అది విద్యార్థులను ప్రభావితం చేస్తోంది. ప్రైవేటు కాలేజీల్లో జేఎన్‌టీయూ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు తలెత్తవని విద్యార్థులు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో జేఎన్‌టీయూ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. కాగా, జేఎన్‌టీయూ అకడమిక్‌ అండ్‌ ప్లానింగ్‌ విభాగం ఇటీవల తీసుకొచ్చిన ఆర్‌-22 నిబంధన వల్ల 600 మంది ఫస్టియిర్‌ విద్యార్థులు మొదటి సెమిస్టర్‌ పరీక్షలకు దూరమయ్యారు. ఇంటర్నల్స్‌లో 40 శాతం మార్కులు సాధించని విద్యార్థులను ఎక్స్‌టర్నల్స్‌కు అనుమతించం అనేది ఆర్‌-22 నిబంధన. దీని వల్ల 600 మంది విద్యార్థులు వచ్చే ఏడాది తమ జూనియర్స్‌తో కలిసి పరీక్షలు రాసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే, ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌లో కలిపి సగటున 40శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందేలా పాత విధానాన్నే అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-05-31T11:40:23+05:30 IST

News Hub