Simultaneous Elections : దిల్లీ సే గల్లీ తక్‌..

ABN , First Publish Date - 2023-09-03T03:07:35+05:30 IST

లోక్‌సభ, అసెంబ్లీలే కాదు.. మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు కూడా దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరగాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఒకే ఓటరు జాబితా, ఒకే ఓటరు కార్డు ఉండాలని అభిలషిస్తోంది. జమిలి ఎన్నికల దిశగా కసరత్తును కేంద్రం వేగవంతం చేసింది. మాజీ రాష్ట్రపతి ...

Simultaneous Elections  : దిల్లీ సే గల్లీ తక్‌..

లోక్‌సభ, అసెంబ్లీ, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు!

‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించిన కేంద్రం

అమిత్‌ షా, అధిర్‌ రంజన్‌, గులాంనబీ, హరీశ్‌సాల్వే తదితరులకు చోటు

అవసరమైతే రాజ్యాంగ సవరణకు సిఫారసు.. హంగ్‌ స్థితికి పరిష్కారంపై దృష్టి

కమిటీకి 7 విధివిధానాలు.. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలన్న కేంద్రం

గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్ర న్యాయశాఖ

‘జమిలి కమిటీ’లో ఉండను.. కమిటీ ఏర్పాటు కంటితుడుపు చర్య: అధిర్‌

విధివిధానాల్లో కొన్ని..

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై అధ్యయనం చేసి తగిన సిఫారసులు చేయడం. ప్రస్తుత రాజ్యాంగ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని జమిలి ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యాంగానికి, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950కి, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951కి, నిబంధనలకు చేపట్టాల్సిన సవరణలను సిఫారసు చేయడం.

రాజ్యాంగానికి చేపట్టే సవరణలకు రాష్ట్రాల ఆమోదం అవసరమా లేదా అన్నది అధ్యయనం చేసి సిఫారసు చేయడం.

చట్టసభల్లో హంగ్‌ పరిస్థితి, అవిశ్వాస తీర్మానం ఆమోదం, సభ్యుల ఫిరాయింపులు వంటి సందర్భాల్లో జమిలి ఎన్నికల విధానం ఎలా ఉంటుందో విశ్లేషించి తగిన పరిష్కారాన్ని సిఫారసు చేయడం.

ఏకకాలంలో (జమిలి) ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోతే దశల వారీ, నిర్దిష్ట కాలపరిమితిలోగా నిర్వహించడంపై విశ్లేషించి అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను సిఫారసు చేయడం.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ, అసెంబ్లీలే కాదు.. మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు కూడా దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరగాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఒకే ఓటరు జాబితా, ఒకే ఓటరు కార్డు ఉండాలని అభిలషిస్తోంది. జమిలి ఎన్నికల దిశగా కసరత్తును కేంద్రం వేగవంతం చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. శనివారం ఆ కమిటీ సభ్యుల పేర్లను కూడా ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, జమ్మూకశ్మీర్‌ నేత గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థికసంఘం మాజీ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వే, మాజీ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది. కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా కమిటీ సమావేశాలకు హాజరవుతారని, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నితిన్‌ చంద్ర కమిటీకి కార్యదర్శిగా వ్యవహరిస్తారని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మునిసిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని, అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను సిఫారసు చేస్తుందని పేర్కొంది. కమిటీ కార్యాచరణ తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే, కమిటీ తన నివేదికను అందించడానికి నిర్దిష్టమైన కాలపరిమితిని విధించలేదు. సాధ్యమైనంత త్వరగా నివేదిక అందించాలని సూచించింది. ఈ మేరకు కమిటీకి ఏడు విధివిధానాలను కేంద్రం ఖరారు చేసింది.

విధివిధానాలు ఇవే...

జమిలి ఎన్నికల విధానం కొనసాగడానికి తగిన రక్షణ చర్యలను సిఫారసు చేయడం. జమిలి విధానానికి విఘాతం కలగకుండా ఉండేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించడం.

జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన మానవ వనరులు, ఈవీఎంలు, వీవీప్యాట్‌ యంత్రాల వంటి వాటిపై అధ్యయనం

లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఒకే ఓటరు జాబితా, ఎన్నికల గుర్తింపు కార్డు జారీపై విధివిధానాలను సిఫారసు చేయడం.

పదే పదే ఎన్నికలతో అనేక ఇబ్బందులు

ప్రస్తుతం దేశంలో దాదాపు ప్రతీ ఏటా ఏదో ఒక దగ్గర ఎన్నికలు జరుగుతూనే ఉండడంతో ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని కేంద్రం వివరించింది. సుదీర్ఘకాలం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే జమిలి ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్‌ తన 170వ నివేదికలో సిఫారసు చేసిందని గుర్తు చేసింది. దేశంలో రెండు దశల్లో ఎన్నికల నిర్వహణపై న్యాయ, ప్రజాఫిర్యాదులు, సిబ్బంది శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం 2015 డిసెంబరులో నివేదిక సమర్పించిందని పేర్కొంది. వాటి కొనసాగింపుగానే జమిలిపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసినట్టు పేర్కొంది.

Updated Date - 2023-09-03T03:07:35+05:30 IST