Manipur carnage: మణిపూర్‌ మారణహోమంలో 54కు పెరిగిన మృతులు, పరిస్థితిని అదుపులోనికి తెస్తున్న ఆర్మీ

ABN , First Publish Date - 2023-05-06T16:39:31+05:30 IST

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ లో చెలరేగిన మారణహోమంలో ప్రాణాల కోల్పోయిన వారి సంఖ్య..

Manipur carnage: మణిపూర్‌ మారణహోమంలో 54కు పెరిగిన మృతులు, పరిస్థితిని అదుపులోనికి తెస్తున్న ఆర్మీ

ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ (Manipur)లో చెలరేగిన మారణహోమంలో (Carnage) ప్రాణాల కోల్పోయిన వారి సంఖ్య 54కు చేరింది. అనధికార లెక్కల ప్రకారం మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని చెబుతున్నారు. గిరిజనులు, గిరిజనేతలు మధ్య చెలరేగిన ఘర్షణలతో పరిస్థితి అదుపు తప్పడంతో ఆర్మీని రంగంలోకి దింపడం, అసోం రైఫిల్స్ కీలక ప్రాంతాల్లో మొహరించడంతో పరిస్థితి క్రమంగా కుదుటపడుతోంది. శనివారంనాడు ఇంఫాల్‌ వ్యాలీ పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. ఇంఫాల్ టౌన్‌లో ప్రధాన ఏరియాలు, రోడ్లపై గణనీయంగా ఆర్మీ బలగాలు, ఆర్‌పీఎఫ్, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ మోహరించడంతో మార్కెట్లు క్రమంగా తెరుచుకుంటున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలు కూడా మొదలయ్యాయి. భద్రతా బలగాల పహరా మధ్య ప్రజలు ఉదయమే రోడ్లపైకి వచ్చిన కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేశారు.

కాగా, మణిపూర్‌లో మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన 54 మందిలో, 16 మృతదేహాలను చురాచాంద్‌పూర్ జిల్లా ఆసుపత్రిలో ఉంచారు. మరో 15 మృతదేహాలను ఇంఫాల్ ఈస్జ్ జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. మరో 23 మృతదేహాలను లాంఫెల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్‌లో భద్రపరిచారు. గత 12 గంటల్లో ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ జిల్లాల్లో గృహదహనాలు, దిగ్బంధాలు వంటి చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నా, పరిస్థితి అదుపులోనే ఉందనని డిఫెన్స్ అధికారులు తెలిపారు. అయితే ఆ ఘటనల వివరాలు వెల్లడించలేదు. గిరజన, గిరిజనేతర తెగల మధ్య చోటు చేసుకున్నట్టు చెబుతున్న ఈ ఘర్షణల్లో పలువురు మరణించగా, సుమారు 100 మంది గాయపడినట్టు అనధికార వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు మాత్రం ఈ ఘటనలను ధ్రువీకరించడం లేదు. సుమారు 13,000 పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు రక్షణ వర్గాలు చెబుతున్నాయి.

మెజార్టీ మైతై కమ్యూనిటీని షెడ్యూల్‌ తెగలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు కొద్దిరోజులుగా హింసాత్మకంగా మారడంతో పరిస్థితి అదుపు తప్పింది. షెడ్యూల్ తెగ స్టేటస్ కోసం గిరిజనేతర మైతై వర్గం డిమాండ్‌కు వ్యతిరేకంగా ఆల్‌ ట్రైబల్‌ స్టూడెంట్ యూనియన్‌ గిరిజన సంఘీభావ యాత్రకు పిలుపునిచ్చింది. మొత్తం జనాభాలో 53 శాతంగా ఉన్న మైతైలు ఎక్కువగా ఇంఫాల్ వ్యాలీలో నివసిస్తున్నారు. జనాభాలో 40 శాతం మంది వరకూ నాగాలు, కుకీలు సహా గిరిజనుల ఉన్నారు. వీరు ఎక్కువగా వ్యాలీ చుట్టూ ఉన్న కొండప్రాంత జిల్లాల్లో నివసిస్తున్నారు.

Updated Date - 2023-05-06T16:39:31+05:30 IST