Tamilnadu CBI: అనుమతి లేకుంటే తమిళనాడులో సీబీఐ దర్యాప్తుకి నో... స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-06-14T21:46:45+05:30 IST

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ విచారణకు (CBI) సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది. అంటే ఇకపై తమిళనాడులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటే ముందుగా తమిళనాడు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేందుకు కేంద్ర ఏజెన్సీలను నరేంద్రమోదీ సర్కారు దుర్వినియోగపరుస్తోందంటూ డీఎంకే ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

Tamilnadu CBI: అనుమతి లేకుంటే తమిళనాడులో సీబీఐ దర్యాప్తుకి నో... స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ విచారణకు (CBI) సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది. అంటే ఇకపై తమిళనాడులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటే ముందుగా తమిళనాడు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేందుకు కేంద్ర ఏజెన్సీలను నరేంద్రమోదీ సర్కారు దుర్వినియోగపరుస్తోందంటూ డీఎంకే ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు మంత్రి, డీఎంకే నేత వీ సెంథిల్ బాలాజీ ఇంట్లో ఈడీ సోదాలు, మనీల్యాండరింగ్ కేసులో అరెస్ట్ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో సీబీఐకి సాధారణ అనుమతిని ఉపసంహరించుకున్న 10వ రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. ఈ జాబితాలో ఇప్పటికే చత్తీస్‌గడ్, జార్ఖండ్, కేరళ, మేఘాలయ, మిజోరం, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.

కాగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద సీబీఐ పాలనా వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈ చట్ట ప్రకారం ఢిల్లీ పోలీస్‌కు సీబీఐ ప్రత్యేక విభాగంగా ఉంది. పరిధి కూడా ఢిల్లీకే పరిమితమై ఉంది. వేరే రాష్ట్రాల వ్యవహారాల్లో దర్యాప్తు చేపట్టాలంటే సంబంధిత రాష్ట్రం ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం సీబీఐ పరిధి పరిమితంగానే ఉన్నప్పటికీ సుప్రీంకోర్ట్, హైకోర్టులు ఏ రాష్ట్రంలోనైనా విచారణ చేపట్టమని సీబీఐని ఆదేశించవచ్చు. ఇందుకు రాష్ట్రాల అనుమతితో అవసరం ఉండదు.

సీబీఐకి తమిళనాడు అనుమతి నిరాఖరించినప్పటికీ ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న కేసులను కొనసాగించవచ్చు. అయితే ఈ కేసుల విషయంలో కూడా రాష్ట్రం ప్రభుత్వం సమ్మతిని రద్దు చేసుకుంటే సీబీఐ చేసేదేమీ ఉండదు. దర్యాప్తు చేపట్టకుండానే వెనుదిరగాల్సి ఉంటుంది. అయితే కోర్ట్ ఆదేశాలతో మాత్రం విచారణ చేపట్టేందుకు వెసులుబాటు ఉంటుంది.

Updated Date - 2023-06-14T21:50:23+05:30 IST