IND Vs PAK: అభిమానులకు నిరాశ తప్పదా? దాయాదుల పోరుకు వర్షం ముప్పు

ABN , First Publish Date - 2023-09-01T15:18:01+05:30 IST

శ్రీలంకలోని క్యాండీ వేదికగా ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. అదే సమయానికి వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాయంత్రం 5:30 గంటల వరకు వర్షం కురిసే అవకాశాలు 90 శాతం ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అన్న పరిస్థితులు నెలకొన్నాయి.

IND Vs PAK: అభిమానులకు నిరాశ తప్పదా? దాయాదుల పోరుకు వర్షం ముప్పు

క్రికెట్ అభిమానులు దాదాపు ఏడాది నుంచి దాయాదుల పోరు కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత ఇప్పటి వరకు భారత్, పాకిస్థాన్ జట్లు క్రికెట్‌లో తలపడలేదు. వన్డేల్లో అయితే నాలుగేళ్ల తర్వాత అమీతుమీకి దిగుతున్నాయి. వన్డే ఫార్మాట్‌లో చివరిసారిగా 2019 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు తలపడగా టీమిండియా విజయం సాధించింది. అయితే గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. దీంతో ఆసియా కప్‌లో అందరి కళ్లు ఈనెల 2న పల్లెకెలె వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌పైనే నెలకొని ఉన్నాయి. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం కోసం ఇప్పటికే అభిమానులు శ్రీలంకకు చేరుకున్నారు. అయితే వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు 90 శాతం వరుణుడి ముప్పు ఉందని స్పష్టం చేసింది. దీంతో శనివారం దాయాదుల పోరు జరగడం అనుమానంగా మారింది.

మరోవైపు టీవీ ఛానళ్లు, ఓటీటీలు కూడా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే దాయాదుల మధ్య ఎక్కడ మ్యాచ్ జరిగినా స్టేడియాలు నిండిపోవడంతో పాటు టీవీ, ఓటీటీలలో టీఆర్పీ రేటింగ్స్ కొత్త రికార్డులు సృష్టిస్తాయి. అందుకే ఎలాగైనా శనివారం నాడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగాలని అందరూ కోరుకుంటున్నారు. శ్రీలంకలోని క్యాండీ వేదికగా ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. అదే సమయానికి వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాయంత్రం 5:30 గంటల వరకు వర్షం కురిసే అవకాశాలు 90 శాతం ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అన్న పరిస్థితులు నెలకొన్నాయి.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: విషాదం.. స్టార్ క్రికెటర్లకు బౌలింగ్ చేసిన వీరాభిమాని మృతి

కాగా 1984లో మొదలైన ఆసియా కప్‌లో ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ జట్లు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ అత్యధిక మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఏడు మ్యాచ్‌లలో టీమిండియా గెలవగా.. పాకిస్థాన్ కేవలం ఐదు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. ఒక మ్యాచ్‌‌లో ఫలితం తేలలేదు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ విన్నింగ్ పర్సెంటేజ్ 53.85 శాతంగా ఉండగా, పాకిస్థాన్ గెలుపు శాతం మాత్రం 35.71 శాతంగానే ఉంది.

Updated Date - 2023-09-01T15:18:01+05:30 IST