Share News

Andhra Pradesh : పవన్‌కు సవాల్‌!

ABN , Publish Date - Jun 18 , 2024 | 04:51 AM

వైసీపీ సర్కారు పాలనలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ గాడితప్పింది. కేంద్ర నిధులతో చేపట్టే ఉపాధి హమీ పథకం పూర్తిగా నిర్వీర్యమైంది. పంచాయతీల నిధులను దారి మళ్లించి గ్రామాల్లో కనీస సౌకర్యాల కల్పనకూ కటకటలాడే పరిస్థితులు తీసుకొచ్చారు తమకు భజన చేసేవారిని అధికారులుగా నియమించుకుని ప్రజలకు పాలనను దూరం చేశారు.

Andhra Pradesh : పవన్‌కు సవాల్‌!

గాడితప్పిన గ్రామీణాభివృద్ధి

పంచాయతీరాజ్‌ శాఖ నిర్వీర్యం

ఉపాధి హామీ పథకానికి తూట్లు

తాగునీటి సరఫరా ఛిన్నాభిన్నం

యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం

ఘోరంగా చతికిలపడిన వ్యవస్థలు

రేపు పవన్‌ బాధ్యతల స్వీకరణ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ సర్కారు పాలనలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ గాడితప్పింది. కేంద్ర నిధులతో చేపట్టే ఉపాధి హమీ పథకం పూర్తిగా నిర్వీర్యమైంది. పంచాయతీల నిధులను దారి మళ్లించి గ్రామాల్లో కనీస సౌకర్యాల కల్పనకూ కటకటలాడే పరిస్థితులు తీసుకొచ్చారు తమకు భజన చేసేవారిని అధికారులుగా నియమించుకుని ప్రజలకు పాలనను దూరం చేశారు. వైసీపీ సర్కారు నిర్వాకంతో ఈ శాఖలో పాలన పూర్తిగా అస్తవ్యస్తమైంది. నిధుల దుర్వినియోగంతో వ్యవస్థలన్నీ చతికిలబడ్డాయి. ఇప్పుడు వీటన్నింటినీ సరిదిద్ది దారికి తెచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వంపై పడింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టనున్న పవన్‌కల్యాణ్‌కు ఈ సమస్యలన్నీ సవాలుగా నిలుస్తున్నాయి. పవన్‌ రాకతో శాఖలో సంస్కరణలకు అంకురార్పణ జరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు భూమిలేని వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులకు పనులు కల్పించే అవకాశం ఉంది. అలాగే తాగునీటి శాఖ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించాల్సి ఉంది. సమర్థులైన అధికారులను నియమించి కింది నుంచి పైదాకా ప్రక్షాళన చేస్తే గానీ ఈ శాఖ గాడిలో పడే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దొంగ మస్టర్లతో మమ

చంద్రబాబు హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖపై ప్రత్యేక దృష్టి ఉండేది. లోకేశ్‌ మంత్రిగా ఉండగా ఉపాధి హామీ పథకం ద్వారా ఏటా రూ.10వేల కోట్లు కేంద్ర నిధులు సాధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20వేల కి.మీ మేర గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్‌ రోడ్లు నిర్మించారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఏపీలో జరగడంతో అప్పట్లో ఏటా 11 నుంచి 20 దాకా కేంద్ర అవార్డులు ఈ శాఖకు దక్కేవి. అవెన్యూ ప్లాంటేషన్‌ ద్వారా మొక్కలు, రైతులకు ఉద్యాన మొక్కలతో పాటు నిర్వహణ కోసం భారీగా ఉపాధి నిధులు అందజేసేవారు. దీంతోపాటు వాటర్‌షెడ్లు నిర్వహణ సమర్థంగా చేపట్టారు. ఎన్టీఆర్‌ జలసిరి పేరుతో పేద రైతులకు రూ.6వేలు చెల్లిస్తే రూ.2.50లక్షల విలువైన సోలార్‌ పంపుసెట్లు ఉచితంగా అందించేవారు. వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కనుమరుగయ్యాయి. కూలీలకు సంబంధం లేకుండా మస్టర్లు కొట్టి వైసీపీ కార్యకర్తల జేబులు నింపారు. మెటీరియల్‌ నిధులను సైతం ఉపయోగం లేని జగనన్న కాలనీల చదును కోసం దుర్వినియోగం చేశారు.

గ్రామీణ పేద రైతులకు ఈ పథకం ద్వారా అందే ప్రయోజనాలేవీ అందనీయకుండా చేశారు. వైఎ్‌సఆర్‌ జలకళ పేరుతో కొంతమంది వైసీపీ కార్యకర్తల పొలాల్లో బోర్లు వేశారు. ఈ పథకం పేదలకు అందని ద్రాక్షలాగా మిగిలింది. ఉపాధి హామీ సిబ్బందిని దొంగ మస్టర్లు వేయాలని ప్రభుత్వ అధికారులే ప్రోత్సహించడంతో వారు పూర్తిగా తప్పుడు పనులకు అలవాటుపడ్డారు. క్షేత్రస్థాయిలో ఈ పనుల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను ఉన్నఫళంగా తొలగించాల్సిన అవసరం ఉంది. ఉపాధి పథకంలో నిఘా వ్యవస్థలైన సోషల్‌ ఆడిట్‌, క్వాలిటీ కంట్రోల్‌, విజిలెన్స్‌ విభాగాలను వైసీపీ సర్కారు నిర్వీర్యం చేసింది. సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌గా వైసీపీ ఎమ్మెల్యే బావమరిదిని అర్హత లేకపోయినా నియమించారు.


దీంతో ఆ విభాగం అవినీతిలో కూరుకుపోయింది. విజిలెన్స్‌ విభాగాన్ని సైతం నిర్వీర్యం చేయడంతో అది సుప్తచేతనావస్థలో ఉంది. ఇక క్వాలిటీ కంట్రోల్‌ విధించిన రూ.20 కోట్ల జరిమానాలో కనీసం రూ.లక్షలు కూడా వసూలు చేయలేని దుస్థితిలో గ్రామీణాభివృద్ధిశాఖ యంత్రాంగం ఉంది. గ్రామీణాభివృద్ధి శాఖలో పైనుంచి కింది దాకా సిబ్బందిని మార్చి ప్రక్షాళన చేస్తే తప్ప ఈ శాఖను గాడిలో సాధ్యం కాదని పలువురు పేర్కొంటున్నారు. వాటర్‌షెడ్‌లో ఇతరులను రానీయకుండా అధికారుల నుంచి సిబ్బంది దాకా ఒకే వర్గం పెత్తనం సాగిస్తోంది. గత ఐదేళ్లలో వాటర్‌షెడ్‌, జలకళలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరముంది. అలాగే వైసీపీ సర్కారు వచ్చిన తొలినాళ్లలో రాష్ట్రవ్యాప్తంగా మొక్కల పెంపకంలో జరిగిన అవినీతిని కూడా వెలికి తీయాల్సి ఉంది.

పంచాయతీరాజ్‌లోనూ అంతే..

గ్రామాల్లో పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ఉపాధి హామీ పథకం వైసీపీ నేతల చేతిలోకి పోయింది. ఈ పథకం భ్రష్ఠు పట్టడంతో గ్రామాల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. పంచాయతీలకు కేంద్ర నుంచి వచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి అప్పట్లో నవరత్నాలకు వాడేశారు. ఖజానాలో ఒక్క పైసా కూడా లేకపోవడంతో గ్రామాలు కనీసం తాగునీటి వసతికి కూడా నోచుకోలేకపోతున్నాయి. గ్రామ పంచాయతీలకు అందాల్సిన సీనరేజ్‌, రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు వేశారని విజిలెన్స్‌ తనిఖీలతో పంచాయతీరాజ్‌ ఇంజనీర్లను వేధిస్తున్నారు. గ్రామీణ నీటిసరఫరా విభాగంలో అధికారుల నియామకాలు, పదోన్నతులు అన్నీ అడ్డగోలుగానే సాగుతున్నాయి. కేంద్రం పంపిన జల్‌జీవన్‌ మిషన్‌ నిధులను సద్వినియోగం చేసుకోకపోవడంతో మురిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకపోవడంతో కేంద్రం కూడా నిధులు నిలిపేసింది. గత ప్రభుత్వం పంచాయతీరాజ్‌ సిబ్బందికి శిక్షణనిచ్చే స్టేట్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ(ఎ్‌సఆర్‌డీఎ్‌స)ను గ్రామ, వార్డుసచివాలయ శాఖకు అనుబంధంగా ఉంచింది. ఇప్పుడు ఆ శాఖను మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి అప్పగించారు. దీంతో పంచాయతీరాజ్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చే శాఖ వేరుగా, పంచాయతీరాజ్‌ శాఖ వేరుగా ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఉన్న ఎస్‌ఆర్‌డీఎ్‌సను పంచాయతీరాజ్‌ కిందకు మార్చాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రామ సచివాలయాలన్నీ పంచాయతీ కార్యాలయాల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామ సచివాలయాలను, పంచాయతీరాజ్‌శాఖను వేరుగా చూడలేం. ఈ రెండు శాఖలు వేర్వేరుగా ఉండటంతో ఈ శాఖను బలోపేతం చేయడం సాధ్యంకాదని పలువురు పేర్కొంటున్నారు. ఈ శాఖను ప్రక్షాళన చేయాలంటే వరుసగా 3నెలల పాటు సమీక్షలు నిర్వహించి, కిందిస్థాయి నుంచి పైదాకా మార్పులు తెస్తేనే సాధ్యమని పలువురు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Jun 18 , 2024 | 08:48 AM