Share News

Chicken: చికెన్ అమ్మకాలు బంద్.. కారణమిదే

ABN , Publish Date - Apr 26 , 2024 | 01:53 PM

దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వదిలిపోయిందన్ని ఈ వైరస్ రక్కసి మళ్లీ జన సంచారంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా జార్ఖండ్‌లో సైతం బర్డ్ ఫ్లూ కేసులు విజృంభించాయి.

Chicken: చికెన్ అమ్మకాలు బంద్.. కారణమిదే

రాంచీ: దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వదిలిపోయిందన్ని ఈ వైరస్ రక్కసి మళ్లీ జన సంచారంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా జార్ఖండ్‌లో సైతం బర్డ్ ఫ్లూ(Bird Flu) కేసులు విజృంభించాయి. రాష్ట్ర రాజధాని రాంచీలోనే అత్యధికంగా కేసులు నమోదుకావడంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.

హోత్వార్ ప్రాంతంలోని రీజనల్ పౌల్ట్రీ ఫామ్‌లో 2,196 పక్షులతో పాటు 1,745 కోళ్లు మృత్యువాతపడ్డాయి. అనుమానిత 1,697 గుడ్లను అధికారులు పగలగొట్టారు. భోపాల్‌లోని ఓ ల్యాబొరేటరీలో కోళ్ల నమూనాలను పరీక్షించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా H5N1 నమూనాలో వైరస్ నిర్ధారణ అయింది.


ఈ వైరస్ వల్ల పక్షులు బర్డ్ ఫ్లూ బారిన పడతాయి. దీంతో క్రమంగా అనారోగ్యానికి గురై మృతి చెందుతాయి. వైరస్ వేరే జీవులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. వ్యాధి సోకిన కోళ్లను తింటే ప్రాణాలకే ప్రమాదం. బర్డ్ ఫ్లూ కేసులు బయటపడగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయిన ప్రాంతం నుంచి కిలోమీటరు పరిధిలో కోళ్లు, వాటికి సంబంధించిన ఉత్పత్తులు, గుడ్ల కొనుగోలు, అమ్మకం, రవాణాపై తక్షణమే నిషేధం విధించారు.

Mumbai: హైదరాబాద్ హలీమ్‌కు సచిన్ టెండూల్కర్ ఫిదా..

తదుపరి ఆదేశాలిచ్చే వరకు ప్రభావిత ప్రాంతాల్లో నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. రాంచీ డిప్యూటీ కమిషనర్ రాహుల్ కుమార్ సిన్హా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో వెటర్నరీ అధికారులు, సిబ్బందిని నియమించారు.


వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. పౌల్ట్రీ ఫామ్‌లోని మిగిలిన కోళ్లను చంపి, పారవేసి ఆపై వైరస్ సోకిన ప్రాంతాన్ని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలని సూచించింది.

Delhi: భార్య తెచ్చిన కట్నంపై భర్తకు హక్కు ఉండదు.. తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు

వ్యాప్తి చెందే ప్రదేశం చుట్టూ ఒక కి.మీ వ్యాసార్థాన్ని ఇన్‌ఫెక్షన్ ఉన్న ప్రాంతంగా గుర్తించాలని, దాని చుట్టూ పది కి.మీ వ్యాసార్థాన్ని నిఘా జోన్‌గా గుర్తించాలని అధికారులకు సూచించారు. అయితే వ్యాధి వ్యాపించిన పౌల్ట్రీ ఫామ్‌కి 3 నెలల క్రితమే అనుమతులు లభించినట్లు అధికారులు తెలిపారు. ఏవైనా పక్షులు అనుమానాస్పదంగా మృతి చెంది ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పశుసంవర్ధక శాఖ ప్రజలకు సూచించింది.


లక్షణాలివే..

బర్డ్ ఫ్లూ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ప్రధానంగా పక్షులను ప్రభావితం చేస్తుంది. కానీ అప్పుడప్పుడు మనుషులకు, ఇతర జంతువులపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఇది అడవి పక్షులలో సహజంగా సంభవించే ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల వస్తుంది. వైరస్ సోకిన పక్షులు లేదా వాటి విసర్జనలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న మనుషులకు ఇది వ్యాపిస్తుంది.

వైరస్ సోకితే తేలికపాటి శ్వాసకోశ సమస్యలు మొదలుకొని న్యుమోనియాకు దారితీస్తుంది. తీవ్రత పెరిగితే రోగి మరణించే అవకాశం ఉంది. సోకిన వారికి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. లక్షణాలను ముందుగా గుర్తించి వైద్యుడిని సంప్రదించి.. చికిత్స తీసుకుంటే వ్యాధి నుంచి బయటపడొచ్చు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 06:27 PM