Share News

Lord Rama: రామ్‌లల్లా విగ్రహం ఇదేనా... ఆసక్తిరేపుతున్న కేంద్ర మంత్రి పోస్ట్

ABN , Publish Date - Jan 02 , 2024 | 11:15 AM

అయోధ్యలో త్వరలో ప్రతిష్ఠించనున్న రామ్ లల్లా(Ramlalla) విగ్రహ డిజైన్ ఇదేనంటూ కేంద్ర మంత్రి చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి(Pralhad Joshi) తన ఎక్స్ అకౌంట్ సదరు పోస్ట్ ని షేర్ చేశారు. అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడి విగ్రహాలు కనిపిస్తున్నాయి.

Lord Rama: రామ్‌లల్లా విగ్రహం ఇదేనా... ఆసక్తిరేపుతున్న కేంద్ర మంత్రి పోస్ట్

ఢిల్లీ: అయోధ్యలో త్వరలో ప్రతిష్ఠించనున్న రామ్ లల్లా(Ramlalla) విగ్రహ డిజైన్ ఇదేనంటూ కేంద్ర మంత్రి చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి(Pralhad Joshi) తన ఎక్స్ అకౌంట్ సదరు పోస్ట్ ని షేర్ చేశారు. అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడి విగ్రహాలు కనిపిస్తున్నాయి. దానిని ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారని జోషి ఎక్స్ లో రాసుకొచ్చారు.

అయితే ఈ విషయాన్ని అయోధ్య ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా ప్రకటించలేదు. హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడి జన్మస్థలం కర్ణాటకలో ఉంది. వాల్మీకి రామాయణంలో.. హనుమంతుడు సీతమ్మవారితో గోకర్ణంలో జన్మించానని చెప్పాడు. తుంగభద్ర నదికి ఎడమ ఒడ్డున, హంపికి దగ్గరగా ఉన్న అంజనాద్రి పర్వతం హనుమంతుని జన్మస్థలమని కూడా భక్తులు నమ్ముతారు.


"హనుమంతుడు ఉన్న చోట రాముడు ఉన్నాడు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన కోసం విగ్రహం ఎంపిక ఖరారైంది. ప్రఖ్యాత శిల్పి @yogiraj_arun చెక్కిన శ్రీరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. రామ హనుమంతుడికి ఉన్న సంబంధానికి ఈ విగ్రహం దర్పణం పడుతోంది. హనుమంతుడు జన్మించిన నేలలో పుట్టిన శిల్పి ఈ విగ్రహాన్ని తయారు చేయడం గర్వంగా ఉంది"అని జోషి ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. రాములవారి గర్భగుడిలో ఐదేళ్ల బాలుడిగా ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇందుకోసం మూడు డిజైన్లు పరిశీలనలో ఉన్నాయి. వీటిలో ఒకదానిని ఫైనల్ చేయడానికి ట్రస్ట్ ఇటీవల సమావేశమైంది. అందులో ఒక విగ్రహం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.

కర్నాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని అయోధ్య ఆలయంలో ప్రతిష్టించేందుకు ఎంపిక చేశారన్న వార్తలపై ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన భార్య విజేత యోగిరాజ్ మాట్లాడుతూ.. 'అరుణ్ శిల్పాలు చెక్కడానికి రోజుకి 10 గంటలు పని చేస్తారు. రాములవారి విగ్రహం చెక్కడానికి 24 గంటలు కష్టపడుతూనే ఉండేవారు. ఆయన్ని చూసి నేనెంతో గర్వపడుతున్నా. శ్రీరాముడికి సేవ చేసే భాగ్యం మా కుటుంబానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Jan 02 , 2024 | 11:15 AM