Share News

Shikhar Dhawan: క్రికెట్‌కు వీడ్కోలు

ABN , Publish Date - Aug 24 , 2024 | 08:36 AM

స్టార్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. దేశవాళి క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికారు. గత 13 ఏళ్ల పాటు టీమిండియాకు శిఖర్ ధావన్ ప్రాతినిధ్యం వహించాడు.

Shikhar Dhawan: క్రికెట్‌కు వీడ్కోలు
Shikhar Dhawan

స్టార్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. దేశవాళి క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికారు. గత 13 ఏళ్ల పాటు టీమిండియాకు శిఖర్ ధావన్ ప్రాతినిధ్యం వహించాడు. ‘13 ఏళ్ల నుంచి భారత జట్టు తరఫున క్రికెట్ ఆడా. ఇక వైదొలగాల్సిన సమయం వచ్చింది. క్రికెట్‌కు సెలవు ప్రకటిస్తున్నా. కెరీర్‌లో మధురమైన అనుభవాలు పొందా. దేశం కోసం ఆడటం నా కల నిజమైంది. ఇక ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. నాకు మద్దతుగా నిలిచిన కుటుంబానికి, చిన్ననాటి కోచ్‌లకు, బీసీసీఐకి, డీడీసీఏకి కృతజ్ఞతలు. జై హింద్ అని’ శిఖర్ ధావన్ వీడియోలో ప్రకటించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


shikar-2.jpg


2010లో అరంగేట్రం

శిఖర్ ధావన్ 2010లో అంతర్జాతీయ క్రికెట్‌కు అరంగేట్రం చేశారు. అక్టోబర్ 20వ తేదీన విశాఖపట్టణంలో ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడారు. ఆ సిరీస్‌లో అంతగా ప్రభావం చూపలేదు. ఆస్ట్రేలియా బౌలర్ క్లింట్ మెక్కే చేతిలో రెండుసార్లు డకౌట్ అయ్యాడు. 2011లో నాలుగు వన్డేలు ఆడేందుకు సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఆశించిన స్థితిలో శిఖర్ ఆడలేదు. 2013లో వేల్స్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో తనెంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కెరీర్‌లో వెనుదిరిగి చూడలేదు.


రికార్డులు ఇవే..

టీమిండియా తరపున శిఖర్ ధావన్ 34 టెస్టులు ఆడి 2315 పరుగులు చేశాడు. 167 వన్డేల్లో 6793 పరుగులు, 68 టీ20ల్లో 1759 రన్స్ చేశాడు. ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. భుజం గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూరం అయ్యాడు. ధావన్ స్థానంలో సామ్ క‌ర‌న్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ ధావన్‌ను మేనెజ్‌మెంట్ పక్కన పెట్టింది. 222 ఐపీఎల్ మ్యాచులు ఆడి 6768 పరుగులు చేశాడు. వన్డేల్లో 17 సెంచరీలు, టెస్ట్‌ల్లో 7 సెంచరీలు నమోదు చేశాడు. టెస్టుల్లో శిఖర్ ధావన్ అత్యధిక స్కోరు 190. వన్డేలో 143గా ఉంది. టీ20లో మాత్రం సెంచరీ చేయలేదు.


హిట్ మ్యాన్, గబ్బర్ సింగ్ జోడి

శిఖర్ ధావన్, రోహిత్ శర్మ జోడి సక్సెస్ అయ్యింది. ఇద్దరు క్రీజులో ఉన్నారంటే ప్రత్యర్థి జట్టుకు వణుకే. తొలుత శిఖర్ ధావన్ దాడి చేసేవాడు. పుంజుకున్న తర్వాత రోహిత్ శర్మ వీరవిహారం చేసేవాడు. భారత జట్టుకు మంచి ఓపెనింగ్ జోడిగా పేరు తెచ్చుకున్నారు. 117 వన్డేల్లో వీరిద్దరూ కలిసి 5193 పరుగులు చేశారు. ఇందులో 18 సెంచరీలు, 15 హఫ్ సెంచరీలు ఉన్నాయి.

Updated Date - Aug 24 , 2024 | 09:13 AM