Share News

Telangana Assembly: హరీష్ vs మంత్రులు.. దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ..!

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:18 PM

Telangana Budget 2024: అసెంబ్లీలలో తెలంగాణ రసవత్తర చర్చ నడిచింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మొదలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీల్లో జరిగిన అవకతవకలపై చర్చ హాట్ హాట్‌గా జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఒకవైపు.. సీఎం, మంత్రులు ఒకవైపు సవాళ్లు, ప్రతిసవాళ్లు, వివరణలతో సభ దద్దరిల్లింది.

Telangana Assembly: హరీష్ vs మంత్రులు.. దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ..!
Telangana Assembly

Telangana Budget 2024: అసెంబ్లీలలో తెలంగాణ రసవత్తర చర్చ నడిచింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మొదలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీల్లో జరిగిన అవకతవకలపై చర్చ హాట్ హాట్‌గా జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఒకవైపు.. సీఎం, మంత్రులు ఒకవైపు సవాళ్లు, ప్రతిసవాళ్లు, వివరణలతో సభ దద్దరిల్లింది. బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైన తరువాత అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు తమ ప్రభుత్వ ఘనతను వివరిస్తుండగా.. విపక్షం నుంచి హరీష్ రావు తనదైన శైలిలో ప్రభుత్వంలోని లోపాలను, తప్పులను ఎత్తి చూపారు.


ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క..

సభలో బడ్జెట్‌పై ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. గత పదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారన్నారు. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారన్నారు. అస్తవ్యస్థంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను ఇప్పుడిప్పుడే దారికి తెస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని బాగు చేసే బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని.. బీఆర్ఎస్ నేతలకు కంటగింపుగా ఉందన్నారు. తమలాగా వివిధ మార్గాల్లో నిధులు మళ్లించడం లేదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని విమర్శించారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు వస్తారని భావించామన్నారు. ఆయన వస్తే అన్నింటికీ సమాధానం చెబుదాం అనుకున్నామని.. కానీ, ఆయన సభకు రాలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని ఒకే కుటుంబం చేతిలో పెట్టారని ఆరోపించారు.


బడ్జెట్‌పై హరీష్ రావు కౌంటర్..

‘ఇది అబద్దాల బడ్జెట్. రూ. 18,228 కోట్లు ఆదాయం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ఎలా వస్తుంది? ఎలా ఆదాయం పెంచుతారో చెప్పాలి? ఎక్సైజ్ శాఖను చూస్తే కాంగ్రెస్ సిగ్గుతో తల దించుకోవాలి. 2023-24లో ఎక్సైజ్ ప్రతిపాదిత ఆదాయం రూ. 19,884 కోట్లు. ఇప్పుడు రూ. 25,617 కోట్లు పెట్టారు. పోయిన సంవత్సరం కంటే రూ. 7,773 కోట్లు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఎక్సైజ్ శాఖ ద్వారా రూ. 42 వేల కోట్లు రావాలంటే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టాలి. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట చెబుతోంది. ప్రజలను పీల్చి పిప్పి చేసి ఆదాయం రాబడతమని మంత్రి జూపల్లి ఒప్పుకున్నారు.’ అంటూ ఎక్సైజ్ విధానంపై తనదైన శైలిలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.


భట్టి విక్రమార్క..

‘గత ఏడాదే వైన్ షాపులు వేలం వేశామని హరీష్ రావు అంటున్నారు. ఈ సంవత్సరం పెట్టాల్సిన యాక్షన్ గత ఏడాదే ఎందుకు పెట్టారు. ఎంత దొరికితే అంత దోచుకోవడమే మీ ఆలోచన. టానిక్ లాంటి షాపులకు అనుమతి ఇచ్చి ఆదాయాన్ని ఒకే కుటుంబ సభ్యుల చేతికి మళ్లించారు. మేము అలా కానివ్వం.’ అని హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు మంత్రి భట్టి.


హరీష్ రావు రియాక్షన్..

‘ఎన్నికలప్పుడు బెల్ట్ షాపులు ఎత్తేస్తమని చెప్పారు. మరి బెల్ట్ షాపులు ఎత్తేసి ఎలా ఆదాయం పెంచుకుంటారో చెప్పాలి? నాన్ టాక్స్ రెవెన్యూ గత ఏడాది రూ. 23 వేల కోట్లు వచ్చింది. ఈసారి రూ. 35 వేల కోట్లు వస్తుందని బడ్జెట్‌లో పెట్టారు. రైతు రుణాల కోసం మేము భూములు అమ్మామని ఆనాడు రేవంత్, భట్టి, శ్రీధర్ బాబు రచ్చ చేశారు. ఇప్పుడు రూ. 10 వేల కోట్లు భూములు అమ్మి ఆదాయం సమకూర్చుంటామని చెప్పారు. ఇది వారి ద్వంద వైఖరి కాదా? రూ. 14 వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబులైజేషన్ అన్నారు. ఆ బ్రహ్మ పదార్థం ఏంటో? అదెలా వస్తుందో? చెప్పాలి. రుణమాఫీకి బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్లు మాత్రమే పెట్టారు. మరి మిగిలిన రూ. 5 వేల కోట్ల పరిస్థితి ఏంటి? డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆలస్యం చేసింది. మీరు ఆలస్యం చేయడం వల్ల వచ్చిన వడ్డీని రైతులు ఎందుకు కట్టాలి? నర్సాపూర్ నియోజక వర్గం కొత్తపేట గ్రామంలో సాధి ఆంజనేయులు అనే రైతుకు రూ. 90,575 అప్పు ఉంది. ఆయనకు డిసెంబర్ 9 తర్వాత నుంచి ఇప్పటి వరకు అయిన వడ్డీ కడితేనే రుణమాఫీ చేశారు. రూ. 72 వేల కోట్ల అప్పులు మేము అధికారంలోకి వచ్చేనాటికి ఉన్నాయి. మేము పదేళ్లలో చేసింది రూ. 4.26 లక్షల కోట్లు. కానీ, మేము రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేశామని భట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కరోనా, కేంద్ర విధాన నిర్ణయాల వల్ల రూ. 42 వేల కోట్ల అప్పులు అనివార్యంగా చేయాల్సి వచ్చింది. అవి కూడా తీసేస్తే మేము నికరంగా చేసిన అప్పు రూ. 3,86,890 మాత్రమే.’ అని హరీష్ రావు వివరించారు.


సంక్షేమ పథకాలు అమలు చేయాలి..

‘ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తే.. అవి ప్రజల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఫీజ్ రీయింబర్స్‌మెంట్స్, ఆరోగ్య శ్రీ, 108 సేవలను మార్చకుండా అమలు చేశాము’ అని వివరించారు హరీష్ రావు.


భట్టి విక్రమార్క వర్సెస్ హరీష్ రావు సంవాదం..

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హరీష్ రావు మధ్య సంవాదం నడిచింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి హరీష్ రావు సవాల్ విసిరారు. భట్టి విక్రమార్క వస్తే.. రాష్ట్రంలో కరెంట్ ఎలా ఉందో అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్క్ వద్ద నిలబడి.. దారిలో వెళ్లే ప్రజలను అడుగుదామని అన్నారు. కరెంట్ సరఫరా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బాగుందా? 8 నెలల కాంగ్రెస్ పాలనలో బాగుందా? అని ప్రజలనే అడుగుదామన్నారు. తమ పార్టీలో ఉండి వెళ్లిన కేకే ఇంటికి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వెళ్లినప్పుడు కరెంట్ పోయిందని గుర్తు చేశారు హరీష్ రావు. ఇదే అంశాన్ని అన్ని పత్రికలు ప్రధాన శీర్షికలో ప్రచురించాయని పేర్కొన్నారు.


మంత్రి జూపల్లి కృష్ణారావుకు హరీష్ చురకలు..

అసెంబ్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చురకలంటించారు. సభలో పదే పదే అడ్డుతగలకుండా ఉండే బాగుంటుందని హితవు చెప్పారు. జూపల్లిని ఉద్దేశించి నీ లిక్కర్ కత, మద్యం లెక్కలు అన్నీ చెప్తానంటూ సెటైర్లు వేశారు.


టైమ్, మీడియాపై హరీష్ రావు ఆరోపణలు..

బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. ప్రతిపక్ష నేతలు మాట్లాడేటప్పుడు తమను టీవీలో చూపించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీని చూపించడం లేదని కోడ్ చేశారు హరీష్ రావు. ఇక్కడ తమపైనా అలాగే వివక్ష చూపిస్తున్నారని అన్నారు. హరీష్ రావు ఆరోపణలకు స్పీకర్, మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. రాహుల్ గాంధీ కంటే పదిరెట్లు ఇక్కడ చూపిస్తామన్నారు. రాహుల్ గాంధీ బాటలోనే తాము నడుస్తామన్నారు. ప్రతిపక్ష నాయకులను టీవీలో చూపిస్తున్నామని చెప్పారు. కాగా, మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ బాటలో నడవటం కాదు.. ఆయన చెప్పినట్లు ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు.

దీంతోపాటు.. సభలో తాను మాట్లాడటానికి సమయం ఇవ్వాలని కోరారు హరీష్ రావు. బడ్జెట్ కంటే ప్రధానమైనది సభకు ఏం ఉండదన్నారు. బడ్జెట్‌పై ప్రసంగానికి సమయం ఇవ్వం అంటే ఎలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము చేసిన అప్పులు మాత్రమే చెబుతున్నారని.. తాము పెంచిన ఆస్తుల గురించి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇవన్నీ చెప్పడానికి తనకు సమయం కావాలని కోరారు హరీష్ రావు.


స్పీకర్, మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..

‘బీఆర్ఎస్‌కు 38 మంది ఎమ్మేల్యేలు ఉన్నారు.. ఆ సంఖ్య ప్రకారం మీకొచ్చే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి’ అని హరీష్ రావుకు స్పీకర్ సూచించారు. శ్రీధర్ బాబు సైతం హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాము ఎవరికీ భయపడమన్నారు. ఇప్పటికే హరీష్ రావు గంట మాట్లాడారన్నారు. ఆయన సమయం అయిపోయిందన్నారు. సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు.


Also Read:

కేటీఆర్‌పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

దూరంగా ఉండాలన్న పాపానికి గొంతు కోశాడు

హరిరామ జోగయ్య మళ్లీ స్టార్ట్ చేశారు..

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 27 , 2024 | 01:18 PM