Share News

Kadiyam Srihari: బీజేపీ ఆకృత్యాలను అడ్డుకోవడం ప్రాంతీయ పార్టీల వల్ల కాదు: కడియం శ్రీహరి

ABN , Publish Date - Apr 02 , 2024 | 01:50 PM

వరంగల్: బీజేపీ ఆకృత్యాలను అడ్డుకోవడం ప్రాంతీయ పార్టీల వల్ల కాదని.. జాతీయ పార్టీతోనే సాధ్యమని.. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని, అలాగే తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారానని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. గత పదేళ్లుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటిని నాశనం చేస్తోందని విమర్శించారు.

Kadiyam Srihari: బీజేపీ ఆకృత్యాలను అడ్డుకోవడం ప్రాంతీయ పార్టీల వల్ల కాదు: కడియం శ్రీహరి

వరంగల్: బీజేపీ (BJP) ఆకృత్యాలను అడ్డుకోవడం ప్రాంతీయ పార్టీల వల్ల కాదని.. జాతీయ పార్టీతోనే సాధ్యమని.. అందుకే కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరానని, అలాగే తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారానని కడియం శ్రీహరి (Kadiyam Srihari) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన వరంగల్‌ (Warangal)లో మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్లుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం (Modi Govt.) ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటిని నాశనం చేస్తోందని విమర్శించారు. దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పక్షంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూలగొట్టి, బెదిరించి, ఈడీ (ED), సీబీఐ (CBI) కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న నిందితుడు బీజేపీలో చేరగానే పునీతులైపోతున్నారని.. అంతేకాకుండా దేశంలో ఉన్న ముస్లిం మైనారిటీస్‌ (Muslim Minorities)కు భద్రత లేదన్నారు. అలాగే దేశంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని కడియం శ్రీహరి అన్నారు.

బీఆర్ఎస్‌ (BRS)ను వదలడం తనకు బాధగా ఉందని, ఆ పార్టీ తనకు చాలా అవకాశాలు ఇచ్చిందని, తనకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయలేదని కడియం శ్రీహరి అన్నారు. కానీ తనపై ఆ నేతలు విషం కక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్థాయి దిగజారి మాట్లాడదలుచుకోలేదని అన్నారు. ‘‘మీ బలుపు.. మీ అహంకారం మాటలే ఓటమికి కారణం.. అంతా ఓడారు.. నేను ఒక్కడినే గెలిచననే అక్కసుతో మాట్లాడారు.. బీఆర్ఎస్ ఈ దుస్థితికి పల్లా రాజేశ్వర్ రెడ్డే (Palla Rajeshwar Reddy) కారణం.. పల్లా ఓ చీడ పురుగు.. రాజేశ్వర్ రెడ్డి దమ్ముంటే నా చరిత్ర ఎన్నికల ముందు బయటపెట్టాలి.. నిపూపించకపోతే నీ బట్టలు ఊడదీసి జనగామ చౌరస్తాలో నిలబెడతా.. నిన్నమొన్నటి వరకు నా చుట్టూ ఉన్నవాళ్ళు ఇప్పుడు విషం కక్కుతున్నారు’’.. అని కడియం శ్రీహరి మండిపడ్డారు.

బీఆర్ఎస్ పార్టీ తనకు ఒక్క రూపాయి ఇచ్చినట్లు నిరూపించినా తన బిడ్డ... తాను పోటీ నుండి తప్పుకుంటానని కడియం శ్రీహరి సవాల్ చేశారు. మీ అందరి బతుకులు తనకు తెలుసునని.. వాటిని బయటపెడితే ఎవరూ బయట తిరగలేరని అన్నారు. తాను అవకాశవాదిని కాదని, అవకాశాలే తనను వెతుక్కుంటూ వచ్చాయన్నారు. తాను లేకుంటే మంద కృష్ణమాదిగ (Manda Krishna Madiga) లేరని, ఆర్థికంగా కూడా ఆయనకు సహకారం అందించానని చెప్పారు. బీజేపీకు ఓటు వేయమంటున్న మంద కృష్ణ మాదిగ దండోరా ముసుగు తీసేసీ బీజేపీ (BJP) నేతగా ఆ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయో.. ప్రజలకు తెలుసునని అన్నారు. మంద కృష్ణ మాదిగ స్వార్దం వల్లే ఎమ్మార్‌పీఎస్ (MRPS) బలహీన పడిందన్నారు. ఏఐసీసీ (AICC), పీసీసీ (PCC) తన అవసరాన్ని గుర్తించి.. వెతుక్కుంటూ వచ్చి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)కు పార్టీ నిర్మాణంపైన దృష్టి లేదని.. పార్టీని పట్టించుకోవడం లేదని... నష్టం జరుగుతుందని కేసీఆర్‌కు ముందే చెప్పానని అయినా పట్టించు కోలేదని శ్రీహరి అన్నారు.

‘‘ఇదే నా చివరి ఎన్నిక.. నాది గర్వం కాదు.. ఆత్మాభిమానం.. నన్ను అలా అనుకోవడం మీ అహంకారపు ఆలోచన.. కాంగ్రెస్ పార్టీలో మా చేరిక వల్ల ఆశావహుల్లో అసంతృప్తి ఉంది.. ఎన్నికల సమయంలో ఇలాంటివి కామన్.. బీఆర్ఎస్‌లో ఉండి కేసీఆర్‌కు వెన్ను పోటు పొడవలేకే బయటకు వచ్చాను.. ఎమ్మెల్యే పదవి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటాను.. పార్టీల పిరాయింపు సంస్కృతి బీఆర్ఎస్‌దే’’ అని కడియం శ్రీహరి వ్యాఖ్యనించారు.

Updated Date - Apr 02 , 2024 | 01:52 PM