రామకృష్ణ హత్యకు పెద్దిరెడ్డి అనుచరుడే మూలకర్త
ABN , Publish Date - Mar 18 , 2025 | 01:31 AM
ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రాజకీయకక్షతోనే హత్యకు ఐదుగురి కుట్ర పలుకేసుల్లో ముద్దాయిలైన నిందితులు కేసులో జోక్యమున్నవారు ఎంతటివారైనా వదిలేది లేదన్న ఎస్పీ మణికంఠ

పుంగనూరు, మార్చి17 (ఆంధ్రజ్యోతి): రాజకీయంగా అడ్డుగా ఉన్నాడనే కారణం కక్షగా మారి టీడీపీ కార్యకర్తను బలిగొంది. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు వెంకట్రమణ మరో నలుగురితో కలిసి పథకం మేరకు కిరాతకంగా వేటకొడవలితో టీడీపీ కార్యకర్త కె.రామకృష్ణను హతమార్చారని ఎస్పీ మణికంఠ వెల్లడించారు. పుంగనూరు పోలీస్స్టేషన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్పీ కథనం మేరకు.... పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు కాగతి రామకృష్ణ టీడీపీ కార్యకర్తగా చురుగ్గా పనిచేస్తూ భూ ఆక్రమణలను, అవినీతి వ్యవహారాలను, ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేవారు. సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార సందర్భంగా రామకృష్ణ కుటుంబం సంబరాలు జరుపుకుని కేక్ కట్ చేయబోగా వైసీపీ కార్యకర్త వెంకట్రమణ, మరో వ్యక్తి గొడవచేసి రామకృష్ణ భార్య కాళ్లు విరిగేలా కొట్టారు. అంతేకాకుండా రామకృష్ణ కుటుంబంతో తరచూ గొడవ పడేవారు. గత నెల 10వ తేది మట్టి టిప్పర్ తమ స్థలంలో వెళ్లిందంటూ వెంకట్రమణ మరికొందరు గొడవకు దిగారు. రామకృష్ణ కుమారుడు, కోడలిపై దాడి చేసి గాయపరిచారు. అప్పట్లో పుంగనూరు సీఐ ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. కానీ సీఐ కేసును సీరియస్గా తీసుకోకపోవడంతో దర్యాప్తులో పురోగతి లేదు. రాజకీయ కక్షలు తీవ్రస్థాయికి వెళ్లి పుంగనూరు మండలం గానుగులగడ్డకు చెందిన వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు ఎం.రెడ్డెప్పరెడ్డి పథకం ప్రకారం హత్యకు మూలకర్తగా వ్యవహరించారు. రామకృష్ణ కుమారుడు సురేశ్ను చంపాలని వెంకట్రమణ వేటకొడవలితో నరకడానికి ప్రయత్నించగా చెయ్యి అడ్డుపెట్టి తప్పించుకున్నాడు. ఈలోపు ట్రాక్టర్లో ఇంటికి వచ్చిన రామకృష్ణను వెంకట్రమణ దారుణంగా కొడవలితో నరికి చంపి పారిపోయాడు. ఎం.వెంకటరెడ్డి పథకం ప్రకారం రామకృష్ణతో విబేధాలున్న మహేశ్ వేటకొడవలి ఏర్పాటు చేయగా అతని భార్య రజని, మరో వ్యక్తి త్రిలోక్ నాయుడు కుట్రలో భాగస్వాములయ్యారు. రామకృష్ణ హత్యపై పోలీసులు హత్య, హత్యాయత్నం, మోసపూరిత కుట్రగా కేసులు నమోదు చేసి ప్రధాన నిందితుడు వెంకట్రమణను, ఎం.రెడ్డెప్పరెడ్డిని అరెస్టు చేశారు. నిందితులపై భూఆక్రమణలు, మహిళలపై దాడి, ప్రత్యర్థులను భయబ్రాంతులకు గురిచేయడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు కేసులున్నాయని ఎస్పీ మణికంఠ వివరించారు. మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు. హత్యాయుధాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు. ప్రధాన కుట్రదారుడు రెడ్డెప్పరెడ్డి హత్యకు ముందు తర్వాత నిందితులతో ఫోన్ సంభాషణలోనే ఉన్నాడు. అలాగే వైసీపీకి చెందిన పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కరరెడ్డి, పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ ఛైర్మన్ ఎన్. వెంకటరెడ్డియాదవ్, వైసీపీ నేత చెంగారెడ్డిలతో నిందితుడు వెంకట్ర మణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దీనిపై సమగ్రంగా విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.డీఎస్పీ ప్రభాకర్, రూరల్ సీఐ రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.