Polavaram project: పోలవరం నిర్వాసితులకు మరో రూ.6,270 కోట్లు..
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:35 AM
పోలవరం నిర్వాసితుల పునరావాసానికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం రూ.6,270 కోట్లు విడుదల చేయనుంది. ప్రాజెక్టు పనులు 78.56% పూర్తవగా, 2027లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. సహాయ పునరావాసంపై ప్రత్యేక దృష్టితో సమీక్షలు జరుపుతున్నారు.

నేరుగా ఖాతాల్లో వేసేందుకు కార్యాచరణ
నిర్మాణానికి సమాంతరంగా పునరావాసం
నేడు ప్రాజెక్టు వద్దకు ముఖ్యమంత్రి
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నిమ్మల
అమరావతి/ఏలూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీ కింద మరో రూ.6,270 కోట్లు విడుదల చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమవుతోంది. సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుండగా.. కాంట్రాక్టర్లకు పూర్తిస్థాయి చెల్లింపులు జరపడంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తుంటుంది. ప్రాజెక్టుకు భూములిచ్చినవారిని మాత్రం విస్మరిస్తుంటుంది. సహాయ పునరావాస కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. అయుతే సీఎం చంద్రబాబు మాత్రం.. పోలవరం నిర్మాణానికి భూములిచ్చినవారిలో అత్యధికులు గిరిజనులే కావడంతో.. ప్రాజెక్టు పూర్తయ్యేలోపు వారికి సమాంతరంగా సహాయ పునరావాసం కల్పించాల్సిందేనని తేల్చిచెప్పారు. అటు నిర్మాణ పనులు కొనసాగిస్తూనే.. సహాయ పునరావాస ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే ఆయన సారథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక.. రూ.1,000 కోట్లను నేరుగా నిర్వాసిత లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసింది. ఇప్పుడు 41.15 మీటర్ల కాంటూరులో భూసేకరణ, సహాయ పునరావాసం, నగదు చెల్లింపుల కోసం రూ.6,270 కోట్లు విడుదల చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 38,060 నిర్వాసిత కుటుంబాలకు గాను ఇప్పటివరకు 14,469 కుటుంబాలకు సహాయ పునరావాసం కల్పించారు. 2027 డిసెంబరులోపు ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ఆ లోపు మిగిలిన నిర్వాసిత కుటుంబాలకూ సాయం అందించాలని చంద్రబాబు ఆదేశించారు.
దీంతో రూ.6,270 కోట్లను గరిష్ఠంగా మూడు విడతల్లో నేరుగా ఖాతాల్లో జమచేయాలని జలవనరుల శాఖ సంకల్పించింది. మరోవైపు.. సీఎం గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 10.45 గంటలకు హెలికాప్టర్లో ప్రాజెక్టు స్థలికి చేరుకుంటారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంటారు. రూ.990 కోట్ల వ్యయంతో చేపట్టిన డయాఫ్రం వాల్ పనులను, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పరిశీలిస్తారు. సహాయ పునరావాస కార్యక్రమాలపైనే ప్రత్యేకంగా సమీక్షిస్తారు. కాంటాక్టు సంస్థలు, ఇంజనీర్లతో సమీక్ష జరుపుతారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జలవనరుల మంత్రి నిమ్మల రామానాయడు బుధవారం రాత్రి ప్రాజెక్టు స్థలి వద్ద పరిశీలించారు. అధికారులతో చర్చించారు. వాస్తవానికి 2014-19 కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే పోలవరం పనులు 71.93 శాతం పూర్తికాగా.. నిర్వాసితులకు రూ.6 వేల కోట్లు అందించారు. 2019-24 మధ్య సహాయ పునరావాసాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కేంద్రం నిధులిస్తేనే మీకిస్తానంటూ జగన్ నిర్వాసితుల సమక్షంలోనే చేతులెత్తేసిన సంగతి తెలిసిందే.
78.56 శాతం పనులు పూర్తి..
ఐదేళ్లు మూలనపడిన పోలవరం పనులను చంద్రబాబు ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటిదాకా 78.56 శాతం పూర్తయ్యాయి. 2019 నాటికి 71.93 శాతం మేర పూర్తయిన ప్రాజెక్టు పనులు.. తర్వాతి ఐదేళ్లలో 3.84 శాతమే అయ్యా యి. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక 2024 జూన్ నుంచి 2025 ఫిబ్రవరి నాటికి.. అంటే 89 నెలల్లోనే 2.78 శాతం పనులు పూర్తయ్యాయి. హెడ్వర్క్స్ పనులు 76 శాతం, కుడి కాలువ పనులు 93 శాతం, భూసేకరణ, సహాయ పునరావాసం 25 శాతం మేర జరిగాయి. ముఖ్యంగా డయాఫ్రం వాల్ పనులు శరవేగంగా నడుస్తున్నా యి. గత నెల 18న వీటిని ప్రారంభించగా.. డిసెంబరునాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ వాల్ మొత్తం పొడవు 1396.60 మీట ర్లు కాగా.. ఇప్పటికి 158.20 మీటర్లు నిర్మించారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..