గోదావరిలో భూములు కలిసిపోతున్నాయి
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:16 AM
యానాం ప్లడ్ మేనేజ్మెంట్ అభివృద్ధి (వరద పరిరక్షణ గట్టు)కు సబంధించిన పలు అంశాలపై ఢిల్లీలోని కేంద్ర అధికారులతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సమావేశమయ్యారు.

యానాం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): యానాం ప్లడ్ మేనేజ్మెంట్ అభివృద్ధి (వరద పరిరక్షణ గట్టు)కు సబంధించిన పలు అంశాలపై ఢిల్లీలోని కేంద్ర అధికారులతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సమావేశమయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన మల్లాడి అధికారులను కలి శారు. కేంద్ర ప్రజా పనుల శాఖ (సీపీడబ్ల్యుడీ) చీఫ్ ఇంజనీర్ రాయ్, డిప్యూటీ డైరెక్టర్ అశోక్, అసిస్టెంట్ డైరెక్టర్ భరత్లను మల్లాడి కలిశారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఈనెల 16న కేంద్రం పలు అంశాలపై నివేదిక కోరగా వాటికి సంబంధించిన అంశాలపై నివేదికలను మల్లాడి సమర్పించారు. ఈసందర్భంగా వారితో మల్లాడి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా వరదలతో యానాంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రైతులకు సంబంధించిన అనేక వందల ఎకరాలు భూములు కోతకు గురై గోదావరిలో కలిసిపోతున్నాయని వివరించారు. గతంలో గవర్నర్ కిరణ్బేడీ పెట్టిన ఇబ్బందుల వల్ల ఈపనులు జరగలేదన్నారు. ప్రతి సంవత్సరం వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈప్రాజెక్టుతో సరిహద్దు ప్రాంతానికి నష్టం వస్తుందని అధికారులకు పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈఫిర్యాదులు చేసిన వారు యానాం ప్రాంతం వారు కావడం విశేషమన్నారు. ఇది రాజకీయంగా ప్రాజెక్టు అడ్డుకునేందుకు చేసే ప్రయత్నం తప్ప దీనిలో వాస్తవం లేదన్నారు. దీనిపై కేంద్రం ఒక బృందాన్ని పంపి వాస్తవ పరిస్థితిని తెలుసుకుని త్వరలోనే ఈప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి కార్యరూపం దాల్చడానికి చర్యలు తీసు కోవాలని అధికారులను మల్లాడి కోరారు.