ఎన్టీటీపీఎస్లో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:04 AM
నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేజ్-1 బంకర్కు వెళ్లే కన్వేయర్ బెల్ట్కు బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

స్టేజ్-1 బంకర్కు వెళ్లే కన్వేయర్ బెల్టుకు మంటలు
50మీ. బెల్టు దగ్ధం.. రూ.1.50 కోట్ల ఆస్తినష్టం
ఇబ్రహీంపట్నం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేజ్-1 బంకర్కు వెళ్లే కన్వేయర్ బెల్ట్కు బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 490 మీటర్ల పొడవైన బెల్టులో 50 మీటర్ల వరకు పూర్తిగా కాలిపోయింది. అయినప్పటికీ మొత్తం బెల్టును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బెల్టు విలువ సుమారు రూ.140 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ప్రమాద సమయంలో అక్కడ కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 2గంటల పాట శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇటీవల బ్రాయిలర్లో పెయింట్ పనిచేస్తూ ఓ కాంట్రాక్టు కార్మికుడు మృతిచెందిన ఘటనను మర్చిపోకముందే ఈ అగ్నిప్రమాదం జరగడం వెనుక అధికారుల పర్యవేక్షణలోపమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. వారం క్రితమే భద్రత వారోత్సవాలంటూ హడావుడి చేసిన ఎన్టీటీపీఎస్ అధికారులు ప్రమాదాలను నివారించడంలో పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సమయపాలన లేకపోవడం, విధుల్లో ఉండాల్సిన అధికారులు బయటకు వచ్చి సొంత పనుల్లో నిమగ్నం కావడంతో పాటు వారి బాధ్యతారాహిత్యంతో ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.