వరిలో మరో 12 రకాల వంగడాలు
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:51 PM
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న 12 రకాల వరి నూతన రకాల వంగడాలను శుక్రవారం క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.

క్షేత్ర ప్రదర్శన నిర్వహించిన ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు
నంద్యాల ఎడ్యుకేషన్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న 12 రకాల వరి నూతన రకాల వంగడాలను శుక్రవారం క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ జాన్సన్ ఆధ్వర్యంలో వరిలో విడుదలకు సిద్ధంగా ఉన్న 12 రకాల వరి వంగడాలను శ్రాస్తవేత్తలు, వ్యవసాయాధికారులు, రైతుల సమక్షంలో విడుదల చేశారు. వీటి గురించి వరి శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ వివరించారు. ఈ సందర్భంగా ఏడీఆర్ డాక్టర్ జాన్సన్ మాట్లాడుతూ రైతులకు ఖరీ్ఫలో మొక్కజొన్న, సజ్జలు, కొర్రలు, సోయా చిక్కుడు వంటి పంటలను శనగ పంట వేసేముందు వేసుకోవడం వల్ల రైతులు అధిక ఆదాయంతో పాటు నేల ఉష్ణోగ్రతను తగ్గించి సేంద్రియ కర్బన శాతం, నేలలో తేమ శాతం, పోషకాల లభ్యత పెంపొందించవచ్చని అన్నారు. జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ ఖరీ్ఫలో కోవెలకుంట్ల డివిజన్ పరిధిలో సుమారు 65 వేల హెక్టార్ల పంట పొలం ఖాళీగా ఉంచడం వల్ల దాదాపు సంవత్సరానికి రూ.32 కోట్ల నష్టం రైతాంగానికి జరుగుతోందన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.