దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:49 PM
పీజీఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య అధికారులను ఆదేశించారు.

కర్నూలు కలెక్టరేట్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జాయింట్ కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్కు సంబంధించి రీఓపెన్ కేసుల మీద ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే కర్నూలు వద్ద 55, కర్నూలు ఆర్డీవో వద్ద 20, పత్తికొండ ఆర్డీవో వద్ద 9, ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 4, రీ ఓపెన్ కేసులు పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ లాగిన్లో పరిష్కారం చేసిన అర్జీలను ఆడిట్ చేయడంలో పురోగతి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రెవెన్యూ గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులలో పెండింగ్లో ఉన్న వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సీఎంవో గ్రీవెన్స్లకు సంబంధించి కర్నూలు ఆర్డీవో వద్ద 18, ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 16, పత్తికొండ ఆర్డీవో 12, డీపీవో 3, డీఎస్వో 2, ట్రైబల్ వెల్ఫేర్, డీఎంహెచ్వో, డీఈవో, హౌసింగ్ పీడీల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్లో ఉన్న వాటిని బీయాండ్ ఎస్ఎల్ఏలో వెళ్లకుండా పరిష్కరించా లన్నారు. రీసర్వేకి సంబంధించి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన గ్రామాల్లో పెండింగ్లో ఉన్న గ్రౌండ్ట్రూతింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ప్రొఫెషన్ కోర్సుల్లో నైపుణ్యం సాధించాలి: ప్రొఫెషన్ కోర్సుల్లో నైపుణ్యం సాధించి భవిష్యత్తులో స్థిర పడాలని జాయింట్ కలెక్రట్ డా.బి. నవ్య విభిన్న ప్రతిభా వంతుల విద్యార్థులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 13 ల్యాప్టాప్లు, 12 సెల్ఫోన్లను జాయింట్ కలెక్టర్ విభిన్న ప్రతిభావంతులకు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర భ్రుత్వం పాలిటెక్నిక్, డిగ్రీ తదితర ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న అర్హులైన విభిన్న ప్రతిభావంతుల కోసం 13 ల్యాప్టాప్లను అందజేశారు. అదేవిధంగా ఇంటర్ కోర్సు పూర్తి చేసిన 12 మంది విభిన్న ప్రతిభావంతులకు సెల్ఫోన్లను అందజేశారు. సమావేశంలో డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.