రేపు డిప్యూటీ సీఎం పవన్ రాక
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:26 AM
ఈ నెల 22వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జిల్లాకు రానున్నారని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.

పర్యటనకు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్ రంజిత్ బాషా
ఓర్వకల్లు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 22వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జిల్లాకు రానున్నారని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓర్వకల్లు మండలం పూడిచర్ల గ్రామ పరిధిలో రైతు సూర రాజన్న పొలంలో ఫారం పాండ్కు భూమి పూజ చేసి అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి గురువారం ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి కలెక్టర్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు, భద్రత గురించి ఎస్పీతో చర్చించారు. సుమారు సభకు 4వేల మంది వరకు హాజరు కానున్నారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్టేజీ, బారికేడ్లు తదితర ఏర్పాట్ల గురించి ఆర్అండ్బీ ఎస్ఈకి పలు సూచనలు చేశారు. వేదికపై ఏర్పాట్లను చూసుకోవాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. పారిశుధ్యం పనులు, శిలాఫలకం ఏర్పాట్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీలు తదితర ఏర్పాట్లు చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయాలని, శుక్రవారం సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు ఓర్వకల్లు ఎయిర్పోర్టును సందర్శించి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, ఎస్ఈ పీఆర్ రామచంద్రరెడ్డి, ఎస్ఈ ఆర్అండ్బీ మహేశ్వరరెడ్డి, ఎస్ఈ ఆర్డబ్ల్యూఎస్ నాగేశ్వరరావు, ఎస్ఈ ట్రాన్స్కో ఉమాపతి, డిస్ర్టిక్ట్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్ శాంతకుమారి, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, ఆర్డీవో సందీప్ కుమార్, డ్వామా పీడీ వెంకటరమణయ్య, మెప్మా పీడీ నాగశివలీల తదితరులు పాల్గొన్నారు.