పట్టా ఇచ్చారు.. స్థలం ఇవ్వరా?
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:28 AM
పేదలకు స్థలాలు అంటూ హడావిడి చేసిన అధికారులు పట్టాలు ఇచ్చి స్థలాలు చూకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

2016లో 2 సెంట్ల చొప్పున పట్టాలు ఇచ్చిన టీపీడీ ప్రభుత్వం
2019లో 1.5సెంట్లు ఇస్తామన్న వైసీపీ
స్థలం కోసం లబ్ధిదారుల పోరాటం
మద్దికెర, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): పేదలకు స్థలాలు అంటూ హడావిడి చేసిన అధికారులు పట్టాలు ఇచ్చి స్థలాలు చూకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మండలంలోని ఎం. అగ్రహారం గ్రామంలో సర్వే నెం. 117/1ఏలోని నాలుగు ఎకరాల్లో నాటి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా 2016లో పట్టాలు పంపిణీ చేశారు. 39 మందికి ఒక్కొక్కరికి రెండు సెంట్ల చొప్పున పట్టాలు ఇవ్వడంతో లబ్ధిదారులు ఆ పట్టాలు తీసుకుని రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ప్రభుత్వం మారడంతో
2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ పార్టీ నాయకులు పట్టాలు పొందిన లబ్దిదారులకు 2సెంట్ల స్థలం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో లబ్ధిదారులు కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఆందోళన చేశారు. స్పందించిన అధికారులు 1.5 సెంట్లు మాత్రమే ఇస్తామని చెప్పారు. అనంతరం లబ్ధిదారులు కొందరు బం డలు పాతారు, అయితే అధికారులు స్థలాల్లోకి వెళితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించ డంతో లబ్ధిదారులు నిరాశ చెందారు. ఎమ్మెల్యే శ్యాంబాబు స్పందించి తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
స్థలం చూపలేదు
గత టీడీపీ హయాంలో పట్టాలు ఇచ్చారు గానీ, స్థలాలు చూపలేదు. గత వైసీపీ నాయకులు అడ్డుకో వడంతో మాకు అన్యాయం జరిగింది. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళతాం. - హుశేన్పీరా, ఎం.అగ్రహారం
జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం
ఇంటి పట్టాల సమస్య జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రికార్డులు పరిశీలించి అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. - హుశేన్ సాహెబ్, తహసీల్దార్