Share News

పారదర్శకంగా ఓటరు జాబితా

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:15 AM

శ్రీశైలం నియోజకవర్గం పరిధిలో పారదర్శకమైన ఓటరు జాబితా తయారీకి ఆయా రాజకీయ పార్టీలు సహకరించాలని ఎస్‌ఆర్‌బీసీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, శ్రీశైల నియోజకవర్గ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ ఓ.రాంభూపాల్‌రెడ్డి కోరారు.

పారదర్శకంగా ఓటరు జాబితా
మాట్లాడుతున్న ఈఆర్వో రాంభూపాల్‌రెడ్డి

ఆత్మకూరు, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం నియోజకవర్గం పరిధిలో పారదర్శకమైన ఓటరు జాబితా తయారీకి ఆయా రాజకీయ పార్టీలు సహకరించాలని ఎస్‌ఆర్‌బీసీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, శ్రీశైల నియోజకవర్గ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ ఓ.రాంభూపాల్‌రెడ్డి కోరారు. ఆత్మకూరు తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఓటరు జాబితాలో పేర్లు, అడ్రస్‌ మార్పు, కొత్త ఓటర్ల కొరకు వచ్చిన దరఖాస్తులను పునర్‌ పరిశీలన చేయాలని సూచించారు. ఇంకా ఎవరైనా కొత్తగా ఓటరు నమోదు, ఇతర సవరణల కోసం ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిని పరిశీలించి నమోదు చేస్తామని వివరించారు. ఈఅంశంపై ప్రతినెల మొదటివారంలో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి పారదర్శకమైన ఓటరు జాబితా తయారీకి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఆత్మకూరు తహసీల్దార్‌ రత్నరాధిక, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబు, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్‌ రమణమ్మ, సీనియర్‌ అసిస్టెంట్‌ వెంకటరమణ, ఆయా పార్టీల నాయకులు ఉన్నారు.

ఆత్మకూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఉదయం శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోని ఆయా మండలాల బీఎల్‌ఓకు ఎస్‌ఆర్‌బీసీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, నియోజకవర్గ ఎలక్ర్టోల్‌ రిజిస్ర్టేషన్‌ ఆఫీసర్‌ ఓ.రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, 1951లోని అంశాలను వివరించడంతో పాటు ఫారం-6,7,8 గురించి వివరించారు. అలాగే బీఎల్‌ఓల విధులపై అవగాహన కల్పించారు.

Updated Date - Apr 04 , 2025 | 01:15 AM