7న అరకులో మెగా యోగా
ABN , Publish Date - Mar 25 , 2025 | 02:11 AM
వచ్చే నెల ఏడో తేదీన 20 వేల మంది గిరిజన విద్యార్థులతో నిర్వహించే మెగా యోగాసనాల కార్యక్రమానికి స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో అభిశేక్గౌడ అధికారులను ఆదేశించారు.

హాజరుకానున్న 20 వేల మంది విద్యార్థులు
108 నిమిషాల్లో 108 రకాల యోగసనాలు
డిగ్రీ కళాశాలలో నిర్వహణ
పరిశీలించిన జేసీ అభిషేక్గౌడ
అధికారులకు పలు సూచనలు
ముఖ్యఅతిథులుగా సీఎం, డిప్యూటీ సీఎంలకు ఆహ్వానం
అరకులోయ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):
వచ్చే నెల ఏడో తేదీన 20 వేల మంది గిరిజన విద్యార్థులతో నిర్వహించే మెగా యోగాసనాల కార్యక్రమానికి స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో అభిశేక్గౌడ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన సబ్కలెక్టర్ శౌర్యమన్ పటేల్, మండల అధికారులతో కలిసి డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. 20 వేల మంది విద్యార్థులు 108 నిమిషాలపాటు నిర్వహించే 108 రకాల యోగాసనాలకు అవసరమైన స్థలం, వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాట్ల నుంచి అధికారులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాన్లను ఆహ్వానించామన్నారు. 20 వేల మంది విద్యార్థులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కింద నుంచి పైస్థాయి వరకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం కళాశాలలో అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల తరలింపునకు సుమారు 200 బస్సులు సమకూరుస్తున్నామని, వీటితోపాటు ప్రముఖలు వచ్చే వాహనాల పార్కింగ్ తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆయన వెంట డీఈవో బ్రహ్మాజీ, డీడీ రజని, టీడబ్ల్యూ ఈఈ వేణుగోపాల్, టీడబ్ల్యూ డీఈఈ సుబ్బారావు, తహసీల్దారు ఎం.వి.ఎస్ ప్రసాద్, ఏటీడబ్ల్యూవో మల్లికార్జునరావు, టీడబ్ల్యూ ఏఈఈ అభిశేక్, తదితరులు వున్నారు.