మినీ రిజర్వాయర్లు నిర్మించాలి
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:01 AM
అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో గిరిజన రైతులు సాగు, తాగునీటి అవసరాల కోసం మినీ రిజర్వాయర్లను నిర్మించాలని, ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబునాయుడుని కలిసి విజ్ఞప్తి చేసినట్టు ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర తెలిపారు. నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులతో కలిసి సోమవారం రాత్రి చంద్రబాబును అమరావతిలో కలిశారు.

అరకులోయలో కొన్ని జిల్లాస్థాయి కార్యాలయాలు ఏర్పాటు చేయాలి
ముఖ్యమంత్రికి ఆర్టీసీ రీజియన్ చైర్మన్ వినతి
అమరావతిలో చంద్రబాబును కలిసిన దొన్నుదొర
అరకులోయ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో గిరిజన రైతులు సాగు, తాగునీటి అవసరాల కోసం మినీ రిజర్వాయర్లను నిర్మించాలని, ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబునాయుడుని కలిసి విజ్ఞప్తి చేసినట్టు ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర తెలిపారు. నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులతో కలిసి సోమవారం రాత్రి చంద్రబాబును అమరావతిలో కలిశారు.
రణజిల్లెడ, రక్తకండిలో మినీరిజర్వాయర్లు నిర్మిస్తే సాగు, తాగునీటి సమస్య తీరడంతోపాటు పర్యాటక ప్రదేశాలుగా మారతాయని ఆయన చెప్పారు. అరకులోయ, పాడేరు ఆర్టీసీ కాంప్లెక్ష్స్ల విస్తరణకు, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్రమైన అరకులోయలో కొన్ని జిల్లాస్థాయి ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో కొన్ని అభివృద్ధి పనులు అసంపూర్తిగా వున్నాయనిని, వాటిని పూర్తిచేయడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో పెదలబుడు సర్పంచ్ దాసుబాబు, పద్మాపురం మాజీ సర్పంచ్ లకోయి మహదేవ్, పెదబయలు మాజీ ఎంపీపీ కొండయ్య, తదితరులు వున్నారు.
ఆర్టీసీ ఎండీని కలిసిన దొన్నుదొర
ఏజెన్సీలో ఎత్తుపల్లాలు రోడ్లు, ఘాట్ మార్గాల్లో మలుపులు వుంటాయని, అందువల్ల మినీ బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును కలిసి విజ్ఞప్తి చేసినట్టు దొన్నుదొర చెప్పారు. గిరిజన రైతులు పండించిన పంటలను మండల, జిల్లా కేంద్రాలకు, విశాఖలోని రైతు బజార్లకు తరలించేందుకు కార్గో బస్సులను అందుబాటులోకి తేవాలని కోరారు.