Share News

నేడు మంత్రి నారా లోకేశ్‌ పర్యటన

ABN , Publish Date - Mar 30 , 2025 | 10:36 PM

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌ సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం నోవాటెల్‌ హోటల్‌ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు అచ్యుతాపురంలోని లేపాక్షి కల్యాణ మండపానికి చేరుకుంటారు.

నేడు మంత్రి నారా లోకేశ్‌ పర్యటన
నారా లోకేశ్‌

అచ్యుతాపురంలో రోడ్డు పనులకు శంకుస్థాపన

అనకాపల్లి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఐటీ, విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌ సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం నోవాటెల్‌ హోటల్‌ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు అచ్యుతాపురంలోని లేపాక్షి కల్యాణ మండపానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు విశ్రాంతి, భోజన విరామం. అనంతరం లేపాక్షి కల్యాణ మండపంలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన టీడీపీ కార్యక్రమంలో పాల్గొంటారు. పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో ముందు వరుసలో నిలిచిన కార్యకర్తలతో లోకేశ్‌ భేటీ అవుతారు.

రోడ్డు పనులకు శంకుస్థాపన

అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వరకు రూ.246 కోట్ల అంచనాలతో నిర్మించనున్న ఫ్లైఓవర్‌, రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అచ్యుతాపురంలోని మోసయ్యపేట కూడలిలో ఫ్లైఓవర్‌ పనులు, అనకాపల్లి వరకు సుమారు 13.8 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు పనులకు మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు రోడ్డు మార్గంలో ఆయన బయలుదేరి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7.15 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళతారు.

Updated Date - Mar 30 , 2025 | 10:36 PM