ఏటీఎం కార్డులను మార్పు చేసి నగదు డ్రా చేస్తున్న దొంగ అరెస్టు
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:42 AM
ఏటీఎం కార్డులను మార్పు చేసి నగదు విత్డ్రా చేస్తున్న దొంగను గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గాజువాక పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జోన్-2 క్రైమ్ ఏసీపీ డి.లక్ష్మణరావు వివరాలను వెల్లిడించారు.

రూ.లక్షా 1,43,000 స్వాధీనం
నిందితుడిపై ఇప్పటికే 5 పోలీస్ స్టేషన్లలో కేసులు
గాజువాక, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఏటీఎం కార్డులను మార్పు చేసి నగదు విత్డ్రా చేస్తున్న దొంగను గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గాజువాక పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జోన్-2 క్రైమ్ ఏసీపీ డి.లక్ష్మణరావు వివరాలను వెల్లిడించారు. ఈ ఏడాది జనవరి 18న మింది ప్రాంతానికి చెందిన దాడి ఆనంద్ సన్యాసి తన భార్య కార్డుతో గాజువాకలోని లక్ష్మీకాంత్ థియేటర్ వద్ద గల ఏటీఎం కేంద్రంలో నగదు డ్రా చేసేందుకు యత్నించారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడకు వచ్చి సహాయం చేస్తున్నట్టు నటించి సన్యాసి వద్దనున్న కార్డును తీసుకుని మరో కార్డును ఇచ్చాడు. అయితే మళ్లీ అదే నెల 20న నగదు డ్రా చేసేందుకు సన్యాసి ఏటీఎం వద్దకు వెళ్లగా ఆ కార్డు పనిచేయలేదు. దీంతో ఆయన చట్టివానిపాలెంలోని బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా ఆ ఏటీఎం కార్డు నుంచి రూ.75 వేలు డ్రా చేసినట్టు సిబ్బంది తెలి పారు. ఈ మేరకు సన్యాసి గాజువాక క్రైమ్ పోలీసు లకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఏటీఎం కార్డును మార్చేసిన మర్రిపాలేనికి చెందిన మువ్వ వీరయ్యచౌదరి (41)ని గాజువాక మోహిని థియేటర్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడు పాత నేరస్థుడేనని, ఆయన వద్ద నుంచి 1,43,000 నగదు, వాచ్ను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ లక్ష్మణరావు తెలిపారు. నిందితుడిపై గాజువాక, పెందుర్తి, గోపాలపట్నం, కంచరపాలెం, ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయన్నారు. సమావేశంలో సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.