Share News

Girl.. wake up! బాలికా.. మేలుకో!

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:27 AM

Girl.. wake up! బాలికలకు భద్రతతో కూడిన చదువు అందివ్వాలని.. పేదరికం వల్ల కాని, తల్లిదండ్రులు లేకపోవడం వల్ల కాని వారి విద్యకు ఆటంకం కలగకూడదన్న సంకల్పంతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను 2008లో ఏర్పాటు చేశారు. ఉత్తమ విద్యాబోధన, నిరంతర వైద్య సేవల కోసం ఒక ఏఎన్‌ఎం, బోధనేతర సిబ్బంది, చివరకు స్వీపర్లు, వాచ్‌మెన్‌ సైతం మహిళలే ఉంటారు. బాలికా రక్షణకు పెద్దపీట వేస్తూ ఏర్పాటుచేసిన ఈ పాఠశాలలను అవగాహన లేక చాలా మంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.

Girl.. wake up! బాలికా.. మేలుకో!
విజయనగరం డబుల్‌ కాలనీలోని కేజీబీవీ స్కూల్‌

బాలికా.. మేలుకో!

మిమ్మల్ని తీర్చిదిద్దేందుకే కేజీబీవీలు

అవగాహనలేక దూరమవుతున్న విద్యార్థినులు

ఆరో తరగతిలో ప్రవేశానికి తాజాగా నోటిఫికేషన్‌

దశాబ్దాల కిందట విద్యాలయాల ఏర్పాటు

బాలికలకు భద్రతతో కూడిన చదువు అందివ్వాలని.. పేదరికం వల్ల కాని, తల్లిదండ్రులు లేకపోవడం వల్ల కాని వారి విద్యకు ఆటంకం కలగకూడదన్న సంకల్పంతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను 2008లో ఏర్పాటు చేశారు. ఉత్తమ విద్యాబోధన, నిరంతర వైద్య సేవల కోసం ఒక ఏఎన్‌ఎం, బోధనేతర సిబ్బంది, చివరకు స్వీపర్లు, వాచ్‌మెన్‌ సైతం మహిళలే ఉంటారు. బాలికా రక్షణకు పెద్దపీట వేస్తూ ఏర్పాటుచేసిన ఈ పాఠశాలలను అవగాహన లేక చాలా మంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రవేశాలు ఉండడం లేదు. తాజాగా కేజీబీవీల్లో ఆరో తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులు మేల్కొని వాటిలో ప్రవేశాలు పొందడం ద్వారా తమ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు.

విజయనగరం, మార్చి 26(ఆంధ్రజ్యోతి):

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2008లో కేజీబీవీలను ప్రారంభించాయి. అప్పట్లో జిల్లాలోని 33 మండలాల్లో వీటిని ఏర్పాటుచేశారు. తొలుత 6 నుంచి పదో తరగతి వరకూ ఉన్న ఈ పాఠశాలల్లో కొన్నేళ్ల కిందట ఇంటర్‌ విద్యను కూడా చేర్చారు. సంప్రదాయ కోర్సులతో పాటు ప్రత్యేక సాంకేతిక కోర్సులనూ అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో కేజీబీవీలో ఒక్కో కోర్సు ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, కంప్యూటర్‌, టేలీ వంటి వృత్తివిద్యా కోర్సులనూ అందిస్తున్నారు. ఇంత చేస్తున్నా విద్యార్థినులు చేరేందుకు ఆసక్తి కనబరచడం లేదు. తమ మండలాల్లో ఇటువంటి పాఠశాలలు ఉన్నాయని చాలా మంది తల్లిదండ్రులకు నేటికీ అవగాహన లేదు. తాజాగా ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఏప్రిల్‌ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పేద విద్యార్థినులు త్వరపడి దరఖాస్తు చేసుకుని తమ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కేజీబీవీల ప్రిన్సిపాళ్లు కోరుతున్నారు.

- జిల్లాలో కొన్ని పాఠశాలల్లో మాత్రమే సీట్లు భర్తీ అవుతున్నాయి. మిగతా పాఠశాలల్లో అవగాహన లేక సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. గ్రామాల్లో డ్రాపౌట్స్‌ను, విద్యార్థినుల తల్లిదండ్రులను కలిసి అవగాహన కల్పించినా పాఠశాలల్లో చేరేందుకు ముందుకు రావడం లేదు.

కేజీబీవీలు ఎక్కడెక్కడ?

ఉమ్మడి జిల్లాలో బాడంగి, బలిజిపేట, భోగాపురం, బొబ్బిలి, బొండపల్లి, చీపురుపల్లి, జియ్యమ్మవలస, డెంకాడ, దత్తిరాజేరు, గంట్యాడ, గరివిడి, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, గజపతినగరం, గుర్ల, జామి, సీతానగరం, పార్వతీపురం, కొమరాడ, కొత్తవలస, కురుపాం, ఎల్‌.కోట, మక్కువ, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, పాచిపెంట, పూసపాటిరేగ, రామభద్రపురం, సాలూరు, తెర్లాం, వేపాడ, విజయనగరంలో కేజీబీవీలు ఉన్నాయి. ఆరు నుంచి ఇంటర్‌ వరకూ ఇక్కడ విద్య అందిస్తున్నారు. ప్రతి తరగతిలో 40 సీట్లు చొప్పున ఉంటాయి. తల్లిదండ్రులు చనిపోయినా, తల్లిదండ్రుల్లో ఒకరు లేని పిల్లలకు ఇక్కడ ప్రాధాన్యమిస్తారు. కంప్యూటర్‌ విద్యతో కూడిన ఉత్తమ విద్యాబోధన అందిస్తారు. సబ్జెక్టుల వారీగా మహిళా ఉపాధ్యాయులు (సీఆర్టీలు)ను నియమించారు. నిరంతర వైద్య సేవల కోసం ఒక ఏఎన్‌ఎం సైతం అందుబాటులో ఉంటుంది. బోధనేతర సిబ్బంది, స్వీపర్లు, వాచ్‌మెన్‌ సైతం మహిళలే ఉంటారు.

మెనూ మరింత పటిష్ఠం

కేజీబీవీ పాఠశాలల్లో పౌష్టికాహారంతో పాటు అన్నిరకాల వసతులు అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజూ ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉంటుంది. మధ్యలో స్నాక్స్‌, బూస్టు, హార్లిక్స్‌, పాలు కూడా అందిస్తారు. వారంలో రోజుకో మెనూ ఉంటుంది. ఎంపిక చేసిన రోజుల్లో మాంసాహారం అందిస్తారు. కోడిగుడ్లు పెడతారు. స్నాక్స్‌లో బెల్లం చక్కీలు సైతం అందిస్తారు. రాత్రి భోజనం తరువాత పండ్లు, పాలు పెడతారు. యూనిఫాంతో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు అందిస్తారు. కంప్యూటర్‌ బోధన, స్టైఫండ్‌, గ్రంథాలయం సేవలు, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రోత్సాహం, ఆత్మరక్షణకు కరాటే, ఆరోగ్యానికి యోగా సైతం నేర్పిస్తారు. బయట వ్యక్తులు లోపలికి ప్రవేశించకుండా అన్ని పాఠశాలలకు ప్రహరీలు నిర్మించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కేజీబీవీలను మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

అవినీతి మరక..

సమగ్ర శిక్ష అభియాన్‌ పరిధిలో ఉండే ఈ పాఠశాలల్లో నిధుల ఖర్చు విషయంలో అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పాఠశాలల నిర్వహణకుగాను ప్రత్యేకాధికారుల ఖాతాల్లో నిధులు ఉంటాయి. వాటిని తమ విచక్షణాధికారంతో ఖర్చు చేసుకునే వెసులబాటు ఉంది. ఈ అధికారాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. సీఆర్‌టీలు తప్పనిసరిగా పాఠశాలల్లోనే ఉండాలి. రోజుకొకరు చొప్పున రాత్రి విధులు నిర్వహించాలి. ప్రత్యేకాధికారి పాఠశాలలోనే ఉండాలి. చాలా పాఠశాలల ప్రత్యేకాధికారులు, సీఆర్‌టీలు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని పాఠశాలలకు ఇప్పటికీ ప్రత్యేకాధికారులు లేరు. ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. సీఆర్‌టీలు కూడా పూర్తిస్థాయిలో లేరు. ఇంటర్‌కు సంబంధించి అధ్యాపకులు కూడా తగినంతమంది లేరు.

కేజీబీవీల్లో చేరాలి

కేజీబీవీ పాఠశాలల్లో ఉత్తమ విద్యాబోధనతో పాటు పౌష్టికాహారం అందిస్తాం. బాలికా రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రుల మాదిరిగానే వారిని కంటికిరెప్పలా చూసుకుంటాం. ఈ విషయం తల్లిదండ్రులు గమనించాలి. తల్లిదండ్రులు లేకపోయినా, వలసపోయినా ఆ పిల్లలను పాఠశాలల్లో చేర్చేందుకు ముందుకు రావాలి.

డాక్టరు రామారావు, ప్రాజెక్టు డైరెక్టర్‌, సమగ్ర శిక్ష అభియాన్‌, విజయనగరం

Updated Date - Mar 27 , 2025 | 12:27 AM