Odisha Barricade ఒడిశా కంచె పరిశీలన
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:03 AM
Inspection of Odisha Barricade కొఠియా గ్రూప్ ఎగువశెంబిలో కత్తులకొండ వద్ద ఒడిశా నిర్మించిన కంచెను సోమవారం ఏపీ అధికారులు పరిశీలించారు.

సాలూరు రూరల్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కొఠియా గ్రూప్ ఎగువశెంబిలో కత్తులకొండ వద్ద ఒడిశా నిర్మించిన కంచెను సోమవారం ఏపీ అధికారులు పరిశీలించారు. ఆర్వోఎఫ్ఆర్ భూములను ఆక్రమించి ఒడిశావాసులు మైనింగ్ కోసం కంచె వేసినట్టు ఎగువశెంబి వాసులు ఇటీవల సాలూరు తహసీల్దార్ ఎన్వీ రమణకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఆయన ఆదేశాల మేరకు ఒడిశా కంచె వేసిన ప్రాంతాన్ని ఆర్ఐ మౌలాలీ, వీఆర్వో తిరుమల, అటవీశాఖాధికారులు గంగరాజు, శ్రీనాథ్, ట్రైనీ ఎస్ఐ రమణ, పోలీసులు సోమరాజు, ఈశ్వరరావు తది తరులు పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడారు. ఒడిశా వేసిన కంచె స్థలం అటవీశాఖ మంజూరు చేసిన ఆర్వోఎఫ్ఆర్ స్థలం ఒకటి కాదని నిర్ధారించారు. ఆర్వోఎఫ్ఆర్ భూమి అక్కడకు కొద్ది దూరంలో ఉందని రైతులకు వివరించారు. కాగా ఒడిశావాసులు ఆకస్మికంగా కంచె పనులు చేయడంపై ఎగువశెంబి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభ పెట్టి తమకు ఈ విషయం చెప్పి ఉంటే బాగుండేదన్నారు. ఒడిశా పోలీసులు కూడా తమ మాటను కనీసం పట్టించుకోలేదని తెలిపారు.