Lok Sabha delimitation: పాతికేళ్లు వాయిదా వేయాలి
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:41 AM
పునర్విభజనకు వ్యతిరేకంగా కేంద్రంపై గట్టిగా గొంతెత్తిన స్టాలిన్కు ఏడు రాష్ట్రాల నుంచి గట్టి మద్దతు లభించింది. ఆయన ప్రారంభించిన పోరాటంలో ‘మేము సైతం...’ అంటూ దక్షిణాదిలోని బీజేపీయేతర పార్టీలకు చెందిన పలువురు సీఎంలు, ప్రముఖులు; పంజాబ్ ముఖ్యమంత్రి భాగమయ్యారు.

ప్రస్తుత లోక్సభ సీట్లను యథాతథంగా ఉంచాలి..
పునర్విభజన న్యాయసమ్మతంగా జరగాలి
దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా ఉండకూడదు
బాధిత రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్షం జరపాలి
ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలి
చెన్నైలో సమావేశమైన జేఏసీ తీర్మానం.. డిమాండ్
స్టాలిన్ పిలుపునకు భారీ స్పందన
3 రాష్ట్రాల సీఎంలు, పలు పార్టీల నేతల హాజరు
రాజకీయ, న్యాయ కార్యాచరణకు నిపుణుల కమిటీ
పునర్విభజన వ్యతిరేక పార్టీల ఎంపీలతో కోర్ కమిటీ
తదుపరి భేటీ హైదరాబాద్లో జరపాలని నిర్ణయం
చెన్నై, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్లపాటు వాయిదా వేయాలని, ప్రస్తుతమున్న లోక్సభ స్థానాలను యఽథాతథంగా కొనసాగించాలని అధికార డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ఉమ్మడి కార్యాచరణ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. పునర్విభజనకు వ్యతిరేకంగా కేంద్రంపై గట్టిగా గొంతెత్తిన స్టాలిన్కు ఏడు రాష్ట్రాల నుంచి గట్టి మద్దతు లభించింది. ఆయన ప్రారంభించిన పోరాటంలో ‘మేము సైతం...’ అంటూ దక్షిణాదిలోని బీజేపీయేతర పార్టీలకు చెందిన పలువురు సీఎంలు, ప్రముఖులు; పంజాబ్ ముఖ్యమంత్రి భాగమయ్యారు. చెన్నైలో శనివారం ఉదయం అధికార డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన తొలి ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశంలో శిక్షించేలా కాదు..
న్యాయ సమ్మతంగా పునర్విభజన జరగాలంటూ వారంతా ఏకకంఠంతో నినదించారు. ఈ పోరాటంలో స్టాలిన్ వెంట ఉంటామని పలువురు నేతలు స్పష్టం చేశారు.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పోరాటం, మరోవైపు న్యాయపరమైన కార్యాచరణ దిశగా పని చేసేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటుచేయాలన్న స్టాలిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అందరూ ఆమోదించారు. లోక్సభ స్థానాల పునర్విభజనను 25 యేళ్లపాటు వాయిదా వేస్తూ, పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని జేఏసీ సమావేశం తీర్మానించింది. ఎంపీ స్థానాల సంఖ్యను ఏమాత్రం తగ్గించడానికి వీల్లేదని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. ‘పునర్విభజన వల్ల నష్టపోతామని ఆందోళన చెందుతున్న రాష్ట్రాలకు చెందిన పార్టీలను ఆహ్వానించి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం జరపాలి.’ అని జేఏసీ కేంద్రాన్ని కోరింది. పునర్విభజనను వ్యతిరేకిస్తున్న పార్టీలకు చెందిన ఎంపీలతో కోర్ కమిటీని ఏర్పాటుచేసుకుని, పార్లమెంటులో సమన్వయంతోను, స్పష్టమైన వ్యూహంతోను పనిచేయాలని నిర్ణయించింది.
జేఏసీ సమావేశ వివరాలను డీఎంకే ఎంపీ కనిమొళి మీడియాకు వెల్లడించారు. పశ్చిమబెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు రావాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోయారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వరూ రాలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ.. వైసీపీ నుండి ప్రతినిధులెవరూ రాకపోయినా, ఈ సమస్యపై ఆ పార్టీ నేత ప్రధానికి లేఖ రాశారని వివరించారు. ‘వైసీపీ మీతోనే ఉన్నట్లు భావిస్తున్నారా’ అని అడగ్గా.. ‘ఆ విషయం మేం చెప్పడం కాదు, లేఖ రాయడం ద్వారా వారే చెప్పారు’ అని కనిమొళి వ్యాఖ్యానించారు. తదుపరి జేఏసీ సమావేశం తెలంగాణ రాజధాని హైదరాబాద్ జరుగుతుందని తెలిపారు.
స్టాలిన్ను పవన్ కలుస్తారు
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరలో స్టాలిన్ను కలుస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా కనిమొళి తెలిపారు. పునర్విభజనపై కేంద్రప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడంలేదని, అదే సమయంలో పునర్విభజన తప్పకుండా జరిగి తీరుతుందనే విధంగా నేతల మాటలు ఉన్నాయని అన్నారు. ఇటీవల ప్రధాని మోదీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు అమలుపై మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆ ప్రక్రిమ చేపడతామని చెప్పడాన్ని బట్టి కేంద్రం దృఢనిశ్చయంతో ఉందని స్పష్టమవుతోందన్నారు.
ఎవరెవరు వచ్చారంటే..
జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన శనివారం చెన్నైలో జరిగిన సమావేశానికి పలువురు ముఖ్యమంరత్రులు, ప్రముఖ నాయకులు హాజరయ్యారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (సీపీఎం), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (కాంగ్రెస్), పంజాబ్ సీఎం భగవంత్మాన్ (ఆప్), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (కాంగ్రెస్), బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ నేతలు వినోద్కుమార్, సురేశ్రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, ఒడిశా మాజీ మంత్రి సంజయ్కుమార్ దాస్ బుర్మా, అమర్ పట్నాయక్ సింగ్ (బీజేడీ), పంజాబ్ రాష్ట్ర శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సర్దార్ బల్వీందర్ సింగ్, దల్జిత్సింగ్ సీమా, సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం, కాంగ్రెస్ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కె.సుధాకరన్, ముస్లిం లీగ్ నేత పీఎంఏ సలామ్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఎన్కే ప్రేమ్చంద్రన్, ఎంఐఎం ప్రతినిధి ఇంతియాజ్ జలీల్, కేరళకాంగ్రెస్ (మణి) ప్రతినిధి జోస్ కె.మణి, కేరళ కొట్టాయం కాంగ్రెస్ ఎంపీ జార్జి కె.ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్పట్నాయక్ వీడియోసందేశం పంపారు.
ఇవి కూడా చదవండి:
Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News