ఇన్ఫోసి్సలో వందలాది ఉద్యోగుల తొలగింపు
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:49 AM
ఇన్ఫోసిస్ మైసూరు క్యాంప్సలో 400 మందికిపైగా ట్రెయినీ ఉద్యోగులను ఒకేరోజు తొలగించడంపై కేంద్ర కార్మికశాఖ స్పందించింది. ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది.

వెంటనే పంపేసిన యాజమాన్యం
కేంద్ర కార్మిక శాఖకు ఉద్యోగుల ఫిర్యాదు
చర్యలు తీసుకోవాలని కర్ణాటకకు కేంద్రం లేఖ
ఇంటర్నల్స్లో ఉత్తీర్ణులు కానందుకే: ఇన్ఫోసిస్
బెంగళూరు, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ఇన్ఫోసిస్ మైసూరు క్యాంప్సలో 400 మందికిపైగా ట్రెయినీ ఉద్యోగులను ఒకేరోజు తొలగించడంపై కేంద్ర కార్మికశాఖ స్పందించింది. ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ కమిషన్ కార్యాలయం రాష్ట్రానికి శుక్రవారం లేఖ పంపింది. సామూహికంగా ఉద్యోగుల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోవాలని లేఖలో కోరింది. ఇటీవల ఉద్యోగులను ఒకేసారి తొలగించిన ఇన్ఫోసిస్ యాజమాన్యం వారందరినీ వెంటనే క్యాంపస్ నుంచి సెక్యూరిటీ సిబ్బంది ద్వారా బయటకు పంపేసింది. దీనిపై బాధిత ఉద్యోగులు కేంద్ర కార్మికశాఖకు ఫిర్యాదు చేశారు. వారితోపాటు ఐటీ ఉద్యోగుల సంక్షేమసంఘం (ఎన్ఐటీఈఎ్స) కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై కేంద్ర కార్మికశాఖ స్పందించింది. కాగా, రాత్రివేళ బయటకు పంపితే ఎక్కడకు వెళ్లాలని.. ఒక రాత్రి హాస్టల్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని మధ్యప్రదేశ్కు చెందిన ఓ యువతి బతిమలాడినా కంపెనీ నిరాకరించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు క్యాంపస్ బయట రాత్రంతా రోడ్డుపైనే గడిపిన ఫోటోలు సొషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది కఠినమైన నియామక ప్రక్రియ: ఇన్ఫోసిస్
ట్రెయినీ ఉద్యోగుల తొలగింపుపై ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. తమ నిర్ణయాన్ని ఆ ప్రకటనలో సమర్థించుకున్నారు. సంస్థలో కఠినమైన నియామక ప్రక్రియలు ఉన్నాయని చెప్పారు. మైసూరు క్యాంప్సలో ప్రాథమిక శిక్షణ పొందాక ఇంటర్నల్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని, వారికి మూడు అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఉత్తీర్ణులు కాకుంటే సంస్థలో పనిచేసేందుకు వీలు ఉండదన్నారు. ఈ మేరకు ముందుగానే వారితో ఒప్పందం చేసుకుంటామని వెల్లడించారు.