Share News

నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:28 PM

గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న 50పడకల క్రిటికల్‌ కేర్‌ భవనాన్ని, 5 అంతస్థుల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు.

నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి

కళ్యాణ్‌నగర్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న 50పడకల క్రిటికల్‌ కేర్‌ భవనాన్ని, 5 అంతస్థుల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. పాత బిల్డింగ్‌లోని రెండో అంతస్థులో రెనోవేషన్‌ పనులను పరిశీలించారు. 15రోజుల్లో రెనోవేషన్‌ పనులను పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రోగులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని, వైద్యులు సమయానికి విధులకు హాజరు కావాలని, రోగుల పట్ల మర్యదగా ప్రవర్తించాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని సూచించారు.

ఏఐ ద్వారా విద్యార్థులకు బోధన సులభతరం

కోల్‌సిటీటౌన్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(కృత్రిమ మేధ)ను వినియోగిస్తూ విద్యార్థులకు సులభతరంగా విద్యా బోధన చేసే దిశగా చర్యలు చేపట్టినట్టు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం గాంధీపార్క్‌ మండల పరిషత్‌ ప్రాథమిక ఇంగ్లీష్‌ ఊర్దూ మీడియం స్కూల్‌లను కలెక్టర్‌ తనిఖీ చేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌లను ప్రారంభించారు. ఏఐ ద్వారా విద్యార్థులను ఆకట్టుకునేలా సులభరీతిలో బోధన ప్రారంభించాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా జిల్లా పరిధిలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు అభ్యాస సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ సహాయంతో బోధన పద్ధతులను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. జిల్లాలో 20 ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తుగా పైలట్‌ ప్రాజెక్టు కింద ఏఐ బోధన ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఏఐ కోర్సు ప్రతీ విద్యార్థికి ప్రత్యేకంగా ఉంటుందని, వారి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ దానికి అనుగుణంగా బోధన జరిగేలా కోర్సులు రూపొందించారని కలెక్టర్‌ పేర్కొన్నారు. విద్యార్థులు తెలుగు, ఆంగ్లం రాయడం, చదవడం గణిత అంశాల్లో పట్టు సాధించేలా చూడడమే కార్యక్రమ లక్ష్యమన్నారు. ప్రతీ పాఠశాలలో ఇంటర్నెట్‌ సదుపాయంతో కంప్యూటర్లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి డీ మాధవి, ఎంఈఓ పీఎం షేక్‌ ఉన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 11:28 PM