ముగిసిన రేణుక అంత్యక్రియలు
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:38 AM
మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు గుమ్మడవెల్లి రేణుక అలియాస్ చైతు అలియాస్ భాను అంత్యక్రియలు సొంతూరు జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని కడవెండిలో ముగిశాయి.

కడవెండిలో అంతిమయాత్రకు భారీగా హాజరైన జనం
విప్లవ, ప్రజా, పౌర సంఘాలు, రాజకీయ పార్టీల నేతల నివాళులు
ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్..
దేవరుప్పుల/చర్ల, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు గుమ్మడవెల్లి రేణుక అలియాస్ చైతు అలియాస్ భాను అంత్యక్రియలు సొంతూరు జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని కడవెండిలో ముగిశాయి. ఛత్తీ్సగఢ్లోని దంతెవాడ ఎన్కౌంటర్లో మృతి చెందిన రేణుక మృతదేహాన్ని కడసారి చూసేందుకు పలు విప్లవ, ప్రజా, పౌర హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల నేతలతో పాటు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. మంగళవారం దంతెవాడ నుంచి అంబులెన్స్లో రేణుక మృతదేహాన్ని తీసుకుని బయల్దేరిన కుటుంబసభ్యులు అర్ధరాత్రి దాటాక స్వగ్రామానికి చేరుకున్నారు. రేణుక పెదనాన్న లక్ష్మీనర్సు ఇంటి వద్ద ఆమె మృతదేహాన్ని చూసి తండ్రి సోమయ్య, సోదరులు జీవీకే ప్రసాద్ అలియాస్ ఉసెండి, రాజశేఖర్తో పాటు గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్, నవ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు గాదె ఇన్నయ్య, మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప, సీపీఐ నేత సీహెచ్ రాజారెడ్డి, సీపీఎం నేత సింగారపు రమేశ్, గద్దర్ కూతు రు వెన్నెల తదితరులు రేణుకకు నివాళులర్పించారు. కళాకారుల డప్పు చప్పుళ్లు, కోలాటం, విప్లవకారులు, ప్రజాసంఘాల నేతల ఆటపాటలు, నినాదాలతో రేణుక అంతియ యాత్ర సాగింది. గ్రామ శివారులోని వాగు వద్ద రేణుక అంత్యక్రియలు జరపగా.. ఆమె సోదరుడు ప్రసాద్ రేణుక చితికి నిప్పంటించారు. కాగా, దండకారణ్యంలో సంపదను దోచి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని కేంద్రం చూస్తోందని విప్లవ, ప్రజా, పౌర హక్కు ల సంఘాల నేతలు మండిపడ్డారు. రేణుక శరీరంపై గాయాలున్నాయని, చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపేయాలని వారు డిమాండ్ చేశారు.
రేణుక ఎన్కౌంటర్ బూటకం..
మావోయిస్టు నేత రేణుక అలియాస్ భానును పోలీసులే ఇంట్లో నుంచి తీసుకెళ్లి హత్య చేశారంటూ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ బుధవారం ఓ లేఖలో పేర్కొంది. ‘రేణుక అనారోగ్యం కారణంగా బీజాపూర్ జిల్లా బెల్నార్లోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న విషయం తెలుసుకుని మార్చి 31 తెల్లవారు జామున పోలీసు బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టి ఆమెను అరెస్టు చేశాయి. ఛత్తీ్సగఢ్, తెలంగాణకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు ఉదయం ఇంద్రావతి నది ఒడ్డుకు ఆమెను తీసుకెళ్లి హత్య చేశారు. రేణుకతో తుపాకీ దొరికిందని చెప్పడం కూడా అబద్ధం’ అని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు.