Temperature Rise: సుర్రుమంటున్న సూరీడు..!
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:19 AM
రాష్ట్రంలో ఎండ తీవ్రత బాగా పెరిగింది. శనివారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

కుమరం భీం జిల్లాలో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
హైదరాబాద్/ మహబూబ్నగర్/ కరీంనగర్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండ తీవ్రత బాగా పెరిగింది. శనివారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి, కెరమెరి మండలాల్లో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 41.4 డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. వనపర్తి జిల్లాలోని కొత్తకోట, అమరచింత మండలాల్లో 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, గద్వాల జిల్లాలోని ఖిల్లా ఘణపూర్లో 40.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.
మహబూబ్నగర్లో 39.9, నాగర్కర్నూల్ జిల్లాలో 39, నారాయణపేట జిల్లాలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో అత్యల్పంగా 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయినట్లు తెలిపింది. రాగల రెండు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగే అవకాశముందని, ఆ తర్వాత క్రమేపి 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణంగా మార్చి నెలాఖరు నాటికి 38-39.5 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా.. ఈ సారి ఇప్పటికే సాధారణం కంటే రెండు డిగ్రీలు మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.