నేటి నుంచి నగరవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ
ABN , First Publish Date - 2020-10-09T10:22:25+05:30 IST
కరీంనగర్ పట్టణంలో డివిజన్ల వారిగా బతుకమ్మ చీరల పంపిణీ మంత్రి గంగుల కమలాకర్ చేతులమీదుగా శుక్రవారం ప్రారంభమవుతుందని కమిషనర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

ప్రారంభించనున్న మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, అక్టోబరు 8: కరీంనగర్ పట్టణంలో డివిజన్ల వారిగా బతుకమ్మ చీరల పంపిణీ మంత్రి గంగుల కమలాకర్ చేతులమీదుగా శుక్రవారం ప్రారంభమవుతుందని కమిషనర్ వల్లూరు క్రాంతి తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాయలంలో అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరలను అందిస్తుందన్నారు.
ఇందులో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డివిజన్ల వారిగా 59,200 చీరలను రేషన్కార్డు ఉన్న వారికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మొదటి మూడు రోజులు అన్ని డివిజన్లలో నగరాలక సంస్థ సిబ్బంది, మెప్మా ఆర్పీలు ఇంటింటికి తిరిగి రేషన్ కార్డు నెంబర్ జాబితా వారిగా చీరలు పంచడం జరుగుతుందన్నారు. మూడు రోజుల తర్వాత రేషన్ షాపుల్లో అందుబాటులో ఉంచి మహిళలకు అందించడం జరుగుతుందన్నారు.
డివిజన్ల వారిగా సిబ్బంది చీరలు అందించిన తర్వాత అక్విడెన్సీ జాబితాలో వారిసంతకంగాని వేలిముద్రనుగాని తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. చీరల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా మహిళలకు చీరలు అందించలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ త్రయంభకేశ్వర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.