ఈ ఏడాది 18 కంపెనీలు రూ. లక్ష కోట్ల మైలురాయికి..
ABN , First Publish Date - 2021-08-29T06:34:33+05:30 IST
దేశీయ స్టాక్ మార్కెట్లో గత ఏడాది ద్వితీయార్ధం నుంచి కొనసాగుతున్న బుల్ ర్యాలీలో పలు కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. దాంతో ఆ కంపెనీల మార్కెట్ విలువ కూడా భారీగా వృద్ధి చెందింది...

- అర్ధ శతకానికి చేరువలో మొత్తం కంపెనీల సంఖ్య
దేశీయ స్టాక్ మార్కెట్లో గత ఏడాది ద్వితీయార్ధం నుంచి కొనసాగుతున్న బుల్ ర్యాలీలో పలు కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. దాంతో ఆ కంపెనీల మార్కెట్ విలువ కూడా భారీగా వృద్ధి చెందింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 18 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మైలురాయిని దాటేసింది. దాంతో, రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన మొత్తం కంపెనీల సంఖ్య అర్ధ శతకానికి చేరువైంది. గత ఏడాదిలో ఈ కంపెనీలు 28 ఉండగా.. ప్రస్తుతం 46కు చేరుకుంది. మరిన్ని విషయాలు..
- గత ఏడాది నాటికే ఈ జాబితాలో చోటు కలిగిన కంపెనీలు ఈ ఏడాదిలోనూ తమ స్థానాన్ని పదిలపర్చుకోగలిగాయి.
- గతంలో ఈ హోదాను కోల్పోయిన ప్రభుత్వ రంగ కంపెనీలు (పీఎ్సయూ) ఎన్టీపీసీ, బీపీసీఎల్ ఈ ఏడాది తిరిగి జాబితాలో చోటు దక్కించుకోగలిగాయి.
- ఈ ఏడాది కొత్తగా జాబితాలో చేరిన పీఎ్సయూ పవర్గ్రిడ్. గతేడాది నాటికే ఈ జాబితాలో స్థానం కలిగిన రెండు పీఎ స్యూల్లో.. ఎస్బీఐ మార్కెట్ విలువ ఈ ఏడాది 49 శాతం వృద్ధి చెందగా, ఓఎన్జీసీ మార్కెట్ క్యాప్ 24 శాతం ఎగబాకింది.
- అదానీ గ్రూప్నకు చెందిన ఐదు కంపెనీలు ప్రస్తుతం రూ.లక్ష కోట్ల క్లబ్లో ఉన్నాయి. కాగా, టాటా గ్రూప్నకు చెందినవి నాలుగు.
- మార్కెట్ దిగ్గజ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మార్కెట్ విలువ ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.2.8 లక్షల కోట్లు పెరగగా.. ఇన్ఫోసిస్ రూ.2 లక్షల కోట్లు, రిలయన్స్ రూ.1.7 లక్షల కోట్లు, విప్రో రూ.1.2 లక్షల కోట్ల మేర మార్కెట్ విలువను పెంచుకోగలిగాయి.
- మార్కెట్లో బుల్ ర్యాలీ దాదాపు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో మున్ముందు మరిన్ని కంపెనీల మార్కెట్ విలువ ఈ మైలురాయిని దాటేందుకు అవకాశాలు పరిమితమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
