హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం

ABN , First Publish Date - 2022-12-17T01:04:04+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీలు మరోమారు ఉద్యమ బాట పట్టారు. చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ యర్రవరం ప్రాంతంలో హైడ్రో పవర్‌ (పంప్డ్‌ స్టోరేజ్టీ) ప్రాజెక్టు నిర్మాణాలకు వ్యతిరేకంగా గిరిజన సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ కంపెనీకి ఏపీ కేబినెట్‌ అనుమతి ఇవ్వడంపై గిరిజనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం
యర్రవరం వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మతో ఆందోళన చేస్తున్న గిరిజన సంఘం నాయకులు, ఆదివాసీలు

నేడు చింతపల్లి సబ్‌ డివిజన్‌ బంద్‌

అనుమతులను రద్దు చేయించాలని అధికార పార్టీ నేతలపై ఒత్తిడి

పవర్‌ ప్రాజెక్టును అడ్డుకోకపోతే బాక్సైట్‌కు టెండర్‌ పెడతారని ఆందోళన

ప్రభుత్వం వెనక్కు తగ్గేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని విస్పష్టం

చింతపల్లి, డిసెంబరు 16: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీలు మరోమారు ఉద్యమ బాట పట్టారు. చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ యర్రవరం ప్రాంతంలో హైడ్రో పవర్‌ (పంప్డ్‌ స్టోరేజ్టీ) ప్రాజెక్టు నిర్మాణాలకు వ్యతిరేకంగా గిరిజన సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ కంపెనీకి ఏపీ కేబినెట్‌ అనుమతి ఇవ్వడంపై గిరిజనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుధవారం చింతపల్లిలో సమావేశమైన గరిజన సంఘం నాయకులు శనివారం చింతపల్లి సబ్‌ డివిజన్‌ బంద్‌కి పిలుపునిచ్చారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావడంతోపాటూ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఆందోళనలు చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. బాక్సైట్‌ తరహాలో ఉద్యమించేందుకు ఆదివాసీలు సమాయుత్తమవుతున్నారు.

పవర్‌ ప్రాజెక్టును అడ్డుకోకపోతే బాక్సైట్‌ను కూడా తవ్వుకుపోతారు

బోనంగి చిన్నయ్య పడాల్‌, గిరిజన సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

గిరిజన చట్టాలు, హక్కులను కాలరాస్తూ వైసీపీ ప్రభుత్వం యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ కంపెనీ మాటున అదానీ గ్రూపునకు గిరిజన ప్రాంతాన్ని ధారాదత్తం చేస్తున్నది. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సమస్య కేవలం నిర్వాసిత గ్రామ వారిదే కాదు. యావత్‌ ఆదివాసీలంతా తమ సమస్యగా భావించాలి. ఇప్పుడు యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో బాక్సైట్‌ మైనింగ్‌కు కూడా అనుమతులు ఇచ్చేస్తారు. అందువల్ల ఆదివాసీలంతా సంఘటితమై హైడ్రో పవర్‌ ప్రాజెక్టును అడ్డుకోవాలి. గిరిజన సంఘం, అఖిల పక్షం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం చింతపల్లి సబ్‌ డివిజన్‌ బంద్‌ని విజయవంతం చేయాలి.

అనుమతులు రద్దు చేసే వరకు ఆందోళనలు

చల్లంగి జ్ఞానేశ్వరి, టీడీపీ అరకు పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి

గిరిజనులకు నష్టం చేసి ఏ ప్రాజెక్టు మాకొద్దు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజనులు చేసే ఉద్యమాలకు టీడీపీ మద్దతు ఇస్తుంది. ప్రత్యక్ష ఆందోళనలో కూడా పాల్గొంటాం. నిర్వాసిత గ్రామాల ఆదివాసీలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. యర్రవరం పవర్‌ పాజ్రెక్టు కార్పోరేటు సంస్థకు అప్పగిస్తూ ఏపీ కేబినెట్‌ ఆమోదాన్ని రద్దుచేసే వరకు ఆందోళనలు ఉధృతం చేస్తాం. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి. అంతవరకు ఆందోళనలను ఆపేది లేదు.

Updated Date - 2022-12-17T01:04:06+05:30 IST