ఎవరా నేత..?

ABN , First Publish Date - 2022-10-26T00:06:10+05:30 IST

వచ్చే ఎన్నికల్లో అధికారమే పరమావధిగా అన్ని రాజకీయ పార్టీలు కుస్తీ పడుతున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ మాద్యమాల ద్వారా ఆరా తీసు కుంటున్నారు. అధికార వైసీపీ ఐప్యాక్‌ను నమ్ము కోవ టంతో పాటు మరో నాలుగు మెగా ఏజెన్సీల ద్వారా గెలు పోటములపై కుస్తీలు పడుతోంది.

ఎవరా నేత..?

పొత్తుంటే ఒకరు.. లేకుంటే ఇంకొకరు

సిట్టింగ్‌ ఎంపీ శ్రీధర్‌పై పునరాలోచన ?

టీడీపీ నుంచి సరికొత్త సీనియర్‌

అసెంబ్లీ నుంచి మాజీని ప్రమోట్‌ చేస్తారా

బీజేపీ నుంచి రంగంలో తపనాచౌదరి

యువ పారిశ్రామిక వేత్త రాజీవ్‌ ఎటువైపు ?

ఏలూరు లోక్‌సభ స్థానంపైఅన్ని పార్టీల్లోనూ తలోమాట

వచ్చే ఎన్నికల్లో అధికారమే పరమావధిగా అన్ని రాజకీయ పార్టీలు కుస్తీ పడుతున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ మాద్యమాల ద్వారా ఆరా తీసు కుంటున్నారు. అధికార వైసీపీ ఐప్యాక్‌ను నమ్ము కోవ టంతో పాటు మరో నాలుగు మెగా ఏజెన్సీల ద్వారా గెలు పోటములపై కుస్తీలు పడుతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం ఇంకో రకంగా నియోజకవర్గాల్లో ఆరా తీసి ఆర్థిక, సామాజిక, స్థానిక హంగులు కలిగిన వారిపై పదేపదే ఆరా తీస్తున్నది. ఇక పొత్తుల విషయానికొస్తే మారే సీట్లపైనా ఇప్పటికే ఎవరి వాదన వారిదే. ఇదే కోణంలో అధికార వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనల్లో ఒకవైపు ఎమ్మెల్యే అభ్యర్ధులపై చర్చ సాగుతుండగానే కొత్తగా ఎంపీ సీట్ల మీద కొత్త రచ్చ ఆరంభమైంది. ఇప్పటికే ఆ దిశగా ఎవరంతట వారుగా లోతట్టు ప్రయత్నాలు ఆరంభిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అప్పటి ఆశావహులు, ఎన్నికల బరిలో నిలిచినవారు ఇప్పుడు కొత్తగా టికెట్‌లు ఆశిస్తున్న వారిపై దృష్టి పెట్టారు.ఎందుకీ ముందస్తు ఆరాలు

వాస్తవానికి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల్లోనూ ప్రధానంగా ఎమ్మెల్యే టికెట్‌లు ఎవరికి వస్తాయనేదానిపైనే సీరియస్‌గా చర్చ సాగుతుంది. కానీ ఈసారి ఎంపీ టికెట్‌లను కూడా ముందస్తుగా ఖరారు చేసే క్రమంలో ఆయా పార్టీల్లో లోతట్టు రాజకీయాలు సాగుతున్నాయి. రాబోయే ఎన్నికలు ‘ఆర్ధికంగా’ ముడిపడి ఉండటంతో ఆ మేరకు పెట్టుబడి పెట్టి సామా జికంగా బలం ఉన్న వారివైపే దృష్టి పెట్టబోతున్నారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తగ్గకుండా ఉంటాయి. అంటే ప్రతీ ఎంపీకి సరాసరిన 20 నుంచి 35 కోట్లు ఖర్చవుతాయి. ఇదంతా అధికారికంగా కాకపోయినా పార్టీల వారీగా అంచనాలను బట్టే. 2019 ఎన్ని కల్లో ఎంపీ టికెట్లు ఖరారులో కూడా అన్ని పార్టీలు ఆచితూచి వ్యవహ రించాయి. తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ళు, వివిధ నియోజకవర్గాల్లో సామాజిక బలబలాల అంచనాలతో పాటు అక్కడున్న ఆర్థిక స్థితిగతులు అన్నిటినీ ముందుగానే లెక్కకట్టారు. ఎంపీ సీటు ఇచ్చే వ్యక్తి అంత ఆషామాషీగా ఉండ కూడదనే నిర్ణయంతోనే ముందుకు వెళ్లారు. ఏలూరు పార్లమెంటరీ నియోజ కవర్గం నుంచి అధికార పార్టీ వైసీపీ నుంచి ఎవరికి టికెట్‌ ఇవ్వాలనేదానిపై అప్పట్లో తర్జనభర్జనలు సాగాయి. దాదాపు రెండు నెలలపాటు రాజకీయ దోబూచులాట జరిగింది. ఒకానొక దశలో ప్రస్తుతం ఎంపీగా గెలిచిన కోటగిరి శ్రీధర్‌కు టికెట్‌ ఇవ్వాలా? ఇవ్వకూడదా అనే నిర్ణయంపై ఊగిసలాడినట్టు అప్పట్లో పార్టీలో ఊహాగానాలు సాగాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చివరికి శ్రీధర్‌వైపు మొగ్గు చూపారు. ఆయనను నేరుగా రంగంలోకి దింపారు. ఆయనను వ్యతిరేకించిన కొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని అప్పట్లో స్వాగ తించలేక పోయారు. అయినా ఎంపీ శ్రీధర్‌ మాత్రం తనకున్న వ్యక్తిగత పరిచయాలు, తన తండ్రి కోటగిరి విద్యాధర రావు రాజకీయ స్నేహితులు అండదండలతో ముందుకే వెళ్ళాలని నిర్ణయించుకుని ధైర్యంగా రంగంలోకి దిగి ముందుకువెళ్ళారు. అప్పట్లో కోటగిరి శ్రీధర్‌ తన సీటు ఖరారు విషయంలో మిగతా వర్గీయులు లేవనెత్తిన అనేక అంశాలను కొంత కాలం సీరియస్‌గానే తీసుకున్నారు. ఇప్పుడు కూడా అధికార పార్టీలో తిరిగి కోటగిరి శ్రీధర్‌కు రెండోసారి అవకాశం ఇస్తారా, లేకుంటే కొత్త ముఖానికి చోటు ఇస్తారా అనే దానిపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ సాగుతోంది. వైసీపీ కీలకంగా భావించే ఐప్యాక్‌ సర్వేల్లో మాత్రం ఇప్పటిదాకా ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపైగాని, ప్రస్తుత సిట్టింగ్‌ లపై గాని పెద్దగా దృష్టి పెట్టలేదు. ఎందుకనంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగే సర్వేల్లోనే పార్టీ పట్టు ఏమిటో తెలిసిపోతుంది. కాబట్టి ప్రత్యేకించి ఎంపీ స్థానాలకు ఈ తరహా సర్వేలు అవసరం లేదని చెబు తారు. అయితే ఒకవేళ ఏలూరు పార్లమెంటు నుంచి కొత్త ముఖాన్ని రంగంలోకి దింపితే సామాజిక వర్గాల వారీగా కాపు, లేదా కమ్మ వర్గానికి చెందిన ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని, వీరిలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని పేరు బహి రంగంగానే వినపడుతోంది. కానీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకే ఆళ్ళ నాని మొదటి నుంచి పట్టుపడుతూ వచ్చారు. భవిష్యత్తులో కూడా అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ శ్రీధర్‌కు ప్రత్యేకించి ఎవరూ పోటీ లేరని, దీనికితోడు నియోజక వర్గంలో వివాదాలకు అతీతంగా ఆయన వ్యవహరిం చారని కొందరు చెబుతుండగా, లేదులేదు చింతలపూడి వంటి నియోజకవర్గంలో శ్రీధర్‌ వర్గం కూడా సొంత కుంపటులు రాజేసిందని ఇంకొందరు అంటారు. ఇక తెలుగుదేశం విషయా నొకిస్తే గడిచిన ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి మాగంటి బాబు ఓటమి చెందారు. ఆ తరువాత ఆయన అనేక కుటుంబపరమైన నష్టాలను ఎదుర్కోవడంతో కొంత మనోవేదనకు గురయ్యారు. ఇటీవలే ఆయన మళ్లీ తిరిగి రోజువారి రాజకీయ కార్యకలాపాల్లో అడుగెట్టారు. అయినా తెలుగు దేశంలో ఈసారి మాగంటి బాబుకు ఇస్తారా, లేదంటే మరెవరి నైనా రంగంలోకి దింపుతారా అనే చర్చ ఆరంభమైంది. సీనియర్‌గా మాగంటి బాబుకు ఒకింత పట్టున్నా మారిన రాజకీయ పరిణామాలతో ఆయనను ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి రంగంలోకి దించి ఇంకొకరిని ఎంపీ స్థానానికి నిలబెట్టబోతున్నారా అనే చర్చ సాగుతోంది. దీనికి అనుగుణంగానే ఒకరిద్దరి పేర్లు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరిని గడిచిన ఎన్నికల్లోనే ఏలూరు నుండి రంగంలోకి దింపాలని ప్రచారం సాగగా, మరోమారు ఆయన పేరే మరోసారి ప్రస్తావనకు వస్తు న్నది. నూజివీడు, కైకలూరు వంటి అసెంబ్లీ స్థానాలు తనకు సుపరిచితం కాబట్టి మిగతా నియోజకవర్గాల్లోనూ దూసుకుపోతారనే ధైర్యాన్ని ఆయన ప్రదర్శిస్తున్నారు. ఆర్ధికంగా హంగు, సామాజిక ధైర్యం కలిసొచ్చే అంశాలుగా ఆయన విశ్లేషిస్తున్నారు. ఇదంతా టీడీపీలో ఒకింత హాట్‌ టాపిక్‌గానే ఉంది. ఈ ప్రతిపాదన సాధ్యం కాకపోతే ఏలూరు ఎంపీగా మాజీ ఎమ్మెల్యే ఒకరిని బరిలోకి దింపుతారని మరో ప్రచారం సాగుతోంది.

ఒకవేళ పొత్తు సర్దుబాటు అయితే..

ఇప్పటికే పొత్తు రాజకీయాలు అందరినీ లెక్క మీద లెక్క కట్టిస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ–జనసేన పొత్తు ఉన్నా, లేకపోయినా ఏలూరు ఎంపీ స్థానం నుంచి పోటీకి బీజేపీ జోనల్‌ ఇన్‌చార్జి గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపనా చౌదరి) ఇప్పటికే సిద్ధపడుతున్నారు. పార్టీ ఆదేశిస్తే రంగంలోకి దిగేందుకు నేరుగా క్షేత్రస్థాయిలో అన్ని అమర్చుకుంటున్నారు. ఇప్పటికే తనకున్న పరిచయాలతో పాటు అన్ని వర్గాలను కలుపుకుపోయే నిర్ణయాలు తీసుకోవడం, ఆ మేరకు వ్యక్తిగతంగా తానే స్వయంగా కలవటం వంటి చర్యలతో ముందున్నారు. జనసేన–బీజేపీ పొత్తు ఉంటే తన గెలుపు అత్యంత సులభమేనని భావిస్తున్నారు. అధిష్టానం ఆశీస్సులు ఆయనకే ఇప్పటికీ ఉన్నాయి. ఇంతకుముందు జనసేన ఎంపీ అభ్యర్థిగా పత్తిపాటి పుల్లారావు పోటీ చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందినవారే కాకుండా మంచి రాజకీయ విశ్లేషణ, ఆర్థిక విశ్లేషణలో పట్టున్న ఆయనను అప్పట్లో ఎంచు కున్నారు. తగినన్ని ఓట్లను సాధించగలిగారు. ఇప్పుడు టీడీపీ–జనసేన పొత్తు ఖరారైతే పరిస్థితి ఇంకో రకంగా ఉండబోతుంది.

బోళ్ళ రాజీవ్‌ ఎక్కడ ?

గడిచిన సాధారణ ఎన్నికలకు ముందు ఏలూరు ఎంపీ స్థానాన్ని బోళ్ళ రాజీవ్‌ ఆశించారు. ఆయన బోళ్ళ బుల్లి రామయ్యకు మనువడు కూడా. సామాజికంగా పారి శ్రామికాధిపతిగా ఆయనకు ఇప్పటికే గుర్తింపు ఉంది. కాని అనూహ్య పరిణామాల నేపథ్యంలో అప్పట్లో తెలు గుదేశం మాగంటి వైపు మొగ్గు చూపడంతో బోళ్ళ రాజీవ్‌ సైలెంట్‌ అయిపోయారు. ఆయన కోసం వైసీపీ కూడా కొన్నాళ్ళపాటు గాలం వేసింది. తమ పార్టీలో చేరాల్సిం దిగా మధ్యవర్తుల ద్వారా ఆహ్వానం పంపింది. అయినా రాజీవ్‌ మాత్రం ఇప్పటి దాకా స్తబ్దుగానే ఉంటున్నారు. ఎలాగూ ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ శ్రీధర్‌ విషయంలో పునరాలోచన చేస్తే బలమైన సామాజిక వర్గం నుంచి రాజీవ్‌ పేరు ప్రతిపాదిస్తారని పార్టీలో ఇప్పటికే వినపడు తోంది. అయితే ఆయన గాని, ఆయన అను చరులుగాని ఎవరూ ఇప్పటిదాకా ఈ అంశంపై నోరు విప్పనేలేదు. త్వరలోనే రాజీవ్‌ నేరుగా బయటకు వచ్చి అటో ఇటో తేల్చు కుంటారా ? లేదా తెలుగు దేశంలోనే ఇమిడి రంగంలోకి దిగుతారా అనేది తేలిపోనుంది.

Updated Date - 2022-10-26T00:06:13+05:30 IST