ఎయిర్‌పోర్టు ప్ర‘వేటు’కు కుట్ర!

ABN , First Publish Date - 2023-05-09T00:54:41+05:30 IST

ఇదో మానిటైజేషన్‌ మోసం. తాము చేయాల్సింది చేయాలనుకున్నప్పుడు.. ఎవరూ గొంతెత్తకూడదనుకుంటే.. ఆ గొంతుకకు గుర్తింపు లేకుండా చేసే కుట్ర ఇది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ఉద్యోగుల గొంతుక వినిపించకుండా ఉండటం కోసం గుర్తింపు ఎన్నికలను నిర్వహించకుండా కేంద్రం అడ్డుపడుతోంది.

ఎయిర్‌పోర్టు ప్ర‘వేటు’కు కుట్ర!

వచ్చే ఏడాదిలో విజయవాడ విమానాశ్రయం ప్రైవేటీకరణ

గుర్తింపు ఎన్నికలకు తీవ్రంగా అడ్డుపడుతున్న కేంద్రం

కేంద్రం తీరుపై పోరుబాట పట్టిన ఉద్యోగులు

ఏ నిర్ణయాలు తీసుకున్నా.. ఉద్యోగ సంఘాలు ప్రశ్నించలేని పరిస్థితి

ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి మానిటైజేషన్‌ ప్రక్రియ

స్థానిక రైతుల నుంచి ఎదురుకానున్న ప్రతిఘటన

ఇదో మానిటైజేషన్‌ మోసం. తాము చేయాల్సింది చేయాలనుకున్నప్పుడు.. ఎవరూ గొంతెత్తకూడదనుకుంటే.. ఆ గొంతుకకు గుర్తింపు లేకుండా చేసే కుట్ర ఇది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ఉద్యోగుల గొంతుక వినిపించకుండా ఉండటం కోసం గుర్తింపు ఎన్నికలను నిర్వహించకుండా కేంద్రం అడ్డుపడుతోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు సదరన్‌ రీజియన్‌లో ఎలాంటి గుర్తింపు ఎన్నికలూ నిర్వహించకుండా ఉండేలా కేంద్రం మౌఖిక ఆదేశాలు ఇవ్వటంతో విజయవాడ ఎయిర్‌పోర్టు ఉద్యోగులు రెండు నెలలుగా ఆందోళన బాట పట్టారు. సదరన్‌ రీజియన్‌ పరిధిలో విజయవాడతో పాటు పలు విమానాశ్రయాలు మానిటైజేషన్‌ జాబితాలో ఉండటంతో కేంద్రం గుర్తింపు ఎన్నికలకు మోకాలడ్డుతోంది. మానిటైజేషన్‌కు సంబంధించి ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి కేంద్రం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. విమానాశ్రయాన్ని మానిటైజేషన్‌ పేరుతో ప్రైవేటీకరించటానికి వివిధ సంస్థలతో సంప్రదింపులు చేసింది. ఈ సమావేశాలు నాలుగైదు ఆ పైన జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయా సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) కోరుతుంది. ఆసక్తి వ్యక్తీకరణ తర్వాత ఎన్ని సంవత్సరాలకు అప్పగించాలి? ఎంత మొత్తానికి అప్పగించాలి? ఆస్తులకు సంబంధించి ఏ ప్రాతిపదికన ఆయా సంస్థలకు స్వాధీనం చేయాలి? వంటి అంశాలకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. ఇదే సందర్భంలో నోటిఫికేషన్లు వంటివి కూడా వెలువరించాల్సి ఉంటుంది.

సదరన్‌లో ‘యూనియన్‌’ బలం

సదరన్‌ రీజియన్‌లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ చాలా గట్టిగా ఉంది. బలమైన ఎంప్లాయీస్‌ యూనియన్‌ను గుర్తింపులోకి తీసుకురాకూడదన్న ఆలోచనతో సదరన్‌ రీజియన్‌లో గుర్తింపు ఎన్నికలకు కేంద్రం కుట్ర పన్నినట్టుగా తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు మౌఖిక ఆదేశాలు ఇవ్వటంతో.. అధికారులెవరూ తమ యూనిట్లలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించటం లేదు. విమానాశ్రయాల్లో కానీ, విమానయాన విధానాలకు సంబంధించి గానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా గుర్తింపు సంఘాలతో చర్చించాల్సి ఉంటుంది. గుర్తింపు సంఘం ఆక్షేపిస్తే నిర్ణయాలను వెనక్కు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నపుడు కేంద్రం తాను తీసుకున్న విమానాశ్రయాల మానిటైజేషన్‌ విధాన నిర్ణయాలను అమలు చేయటం అంత తేలికగా ఉండదు.

ప్రైవేటీకరణ జాబితాలో బెజవాడ ఎయిర్‌పోర్టు

సదరన్‌ రీజియన్‌లో ప్రైవేటీకరణ జాబితాలో ఉన్న అతిపెద్ద విమానాశ్రయం విజయవాడ ఎయిర్‌పోర్టు. విజయవాడ ఎయిర్‌పోర్టు దక్షిణ, తూర్పు మధ్య (సౌత్‌ ఈస్ట్‌ మిడిల్‌ ఏసియా) దేశాలకు అత్యంత దగ్గరగా ఉండటంతో దీనికి భవిష్యత్తు ఎంతో ఉంది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లేవారికి 52 శాతం మంది కోస్తా ప్రాంతానికి చెందిన వారేనన్నది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వేలో వెలుగు చూసింది. ఇలాంటి ఎయిర్‌పోర్టును అతి తక్కువ ధరకు మానిటైజేషన్‌ విధానంలో పొందే ప్రైవేటు సంస్థకు లాభాల పంట పడుతుంది.

ఓ వెలుగు వెలిగిన ఎయిర్‌పోర్టు

అమరావతి రాజధాని ప్రకటన అనంతర పరిస్థితుల్లో విజయవాడ విమానాశ్రయం ఓ వెలుగు వెలిగింది. దేశంలోని మెట్రోపాలిటన్‌ నగరాల వృద్ధికంటే కూడా విజయవాడ విమానాశ్రయ వృద్ధి ఎంతగానో ఉంది. మిలియన్‌ మార్క్‌ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చి రికార్డు సృష్టించింది. దీంతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) కూడా విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. దీనికోసం భూముల అవసరం ఏర్పడటంతో కిందటి టీడీపీ ప్రభుత్వ హయాంలో 700 ఎకరాల భూములను సమీకరించి ఏఏఐకు అప్పగించింది. ఈ భూముల్లో రన్‌వే విస్తరణ, ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌, ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణాలతో పాటు, రహదారి విస్తరణ, పార్కింగ్‌ బేల సామర్ధ్యం పెంపు, బ్యూటిఫికేషన్‌ వంటి అనేక పనులు జరిగాయి.

రైతులు ఎదిరించే అవకాశం

విమానాశ్రయం ప్రైవేటీకరణ అంశంలో ఈసారి స్థానిక రైతుల నుంచి కూడా ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విస్తరణ కోసం తీసుకున్న భూములకు సంబంధించిన రైతులకు ఈ ప్రభుత్వ హయాంలో రాజధానిలో పూర్తిస్థాయిలో ప్లాట్లు కేటాయించలేదు. కౌలు విషయంలోనూ తాత్సారం జరుగుతోంది. ప్లాట్లు రాని రైతులు తమ భూముల్లో ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు. రియల్‌ వెంచర్లలో ప్లాట్లు కోల్పోయిన వారి సమస్యలు అలానే ఉన్నాయి. వీరంతా ఇప్పటికీ పోరాటలు చేస్తున్నారు. తమ భూములను అప్పనంగా ప్రైవేటు సంస్థలు పొందటానికి రైతులు కూడా ససేమిరా అనే పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - 2023-05-09T00:54:41+05:30 IST