Share News

Kurnool Dist.: దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత.. ఉత్సవాలలో అపశృతి

ABN , First Publish Date - 2023-10-25T07:11:27+05:30 IST

కర్నూలు జిల్లా: దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవరగట్టు రక్తసిక్తమైంది. బన్నీ ఉత్సవంలో మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. విగ్రహాల కోసం రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు.

Kurnool Dist.: దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత.. ఉత్సవాలలో అపశృతి

కర్నూలు జిల్లా: దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవరగట్టు రక్తసిక్తమైంది. బన్నీ ఉత్సవంలో మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. విగ్రహాల కోసం రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనల పలువురి భక్తుల తలలు పగిలాయి. కొంతమంది అయితే దివిటీలను గాలిలోకి ఎగుర వేశారు. పలువురికి గాయాలయ్యాయి.

కాగా దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో అపశృతి చోటు చేసుకుంది. సింహాసనం కట్ట వద్ద ఉన్న వేప చెట్టుపైకి కొందరు భక్తులు ఎక్కారు. దీంతో బరువు ఎక్కువకావడంతో చెట్టు కొమ్మ విరిగి పలువురు భక్తులు కిందపడిపోయారు. ఈ ఘటనలో గణేష్ అనే యువకుడు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గణేష్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నఆలూరు వాసిగా గుర్తించారు. కాగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొక వ్యక్తి మృతిచెందాడు. మృతుడు ఆలూరు మండలం మొలగవల్లి కొట్టాల గ్రామానికి చెందిన రామాంజనేయులుగా గుర్తించారు. ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరికొంతమంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం దేవరగట్టు. విజయదశమి పర్వదినాన భక్తుల అడుగులు గట్టు వైపు పడ్డాయి. ఎలాగైనా కర్రల సమరాన్ని ఆపాలని పోలీసులు.. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించాలని భక్తగణం.. బన్ని క్రీడను తిలకించేందుకు తరలి వచ్చిన లక్షలాది భక్తులు.. కొండంతా ఎటు చూసిన జనం.. జనం. మంగళవారం అర్ధరాత్రి 12.15 గంటలు.. చుట్టూ చీకట్లు.. ఆ కాళరాత్రిని చీల్చుకుంటూ భక్తుల చేతుల్లోని కాగడాల వెలుగులు..బండారు (పసుపు) చల్లుతూ డిర్ర్‌ర్ర్‌ర్ర్‌ గోపరాక్‌ (బహుపరాక్‌) అంటూ నెరణికి, నెరణికి తండ, కొత్తపేట గ్రామాలకు వేలాది భక్తులు కొండపైకి చేరారు. ఇష్టదైవమైన మాళ మల్లేశ్వరులకు కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులతో కొండ దిగువన సింహాసన కట్టవద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వివిధ గ్రామాల భక్తులు దేవుడి కోసం సై అనడంతో బన్ని కర్రల సమరం మొదలైంది. తలలపై ఇనుప రింగులు చుట్టిన పట్టుడు కర్రలు నాట్యమాడాయి. అరగంటకు పైగా సాగిన జైత్రయాత్రలో పదుల సంఖ్యలో భక్తుల తలలు పగిలి రక్తం చిందాయి. చూసే వారికి ఇది ఆటవిక చర్య అనిపించినా.. ఆ గ్రామాల భక్తులకు అత్యంత పవిత్రమైన ఉత్సవం.. మంగళవారం అర్ధరాత్రి దేవరగట్టు వేదికగా సాగిన కర్రల సమరంలోని సంబరం ఇది.

జిల్లాలో దేవరగట్టు బన్ని జైత్రయాత్రను చెడుపై మంచి సాధించిన విజయోత్సవ సంబరాలుగా మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలూరు పట్టణానికి 15 కి.మీల దూరంలో హొళగుంద మండలం దేవరగట్టు శ్రీమాళమల్లేశ్వరస్వామి క్షేత్రంలో బన్ని ఉద్రిక్తంగా.. ఉత్కంఠంగా సాగింది. కర్రలు లేకుండా ఉత్సవం జరిపించాలని ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా కలెక్టరు జి.సృజన, ఎస్పీ జి. కృష్ణకాంత్‌, ఆదోని సబ్‌ కలెక్టరు అభిషేక్‌కుమార్‌, పత్తికొండ ఆర్డీఓ మోహన్‌దాస్‌ నేతృత్వంతో నెల రోజులుగా పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయినా కొండపై కర్రలదే పైచేయి అయ్యింది. బన్ని జైత్రయాత్ర కర్రల యుద్ధాన్ని తలపించింది.

Updated Date - 2023-10-25T07:11:27+05:30 IST