Duleep Trophy: ఫైనల్లో దుమ్మురేపిన పృథ్వీ షా.. కానీ..!!

ABN , First Publish Date - 2023-07-13T20:04:40+05:30 IST

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ పోరులో సౌత్ జోన్, వెస్ట్ జోన్ నువ్వా నేనా అన్న తరహాలో పోరాడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 78.4 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వెస్ట్ జోన్ బ్యాటింగ్‌కు దిగగా ఓపెనర్ పృథ్వీ షా మాత్రం దుమ్మురేగేలా ఆడాడు.

Duleep Trophy: ఫైనల్లో దుమ్మురేపిన పృథ్వీ షా.. కానీ..!!

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ పోరులో సౌత్ జోన్, వెస్ట్ జోన్ నువ్వా నేనా అన్న తరహాలో పోరాడుతున్నాయి. సౌత్‌ జోన్‌కు తెలుగు తేజం హనుమ విహారి కెప్టెన్సీ వహిస్తుండగా.. వెస్ట్ జోన్‌కు ప్రియాంక్ పాంచల్ నేతృత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 78.4 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత వెస్ట్ జోన్ బ్యాటింగ్‌కు దిగగా ఈరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేసింది. వెస్ట్ జోన్ బ్యాటర్లలో పృథ్వీ షా (65) ఒక్కడే రాణించాడు.

కాగా సౌత్ జోన్ బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ (28), తిలక్ వర్మ (40), కెప్టెన్ విహారి (63) రాణించారు. మిగతా బ్యాటర్లలో ఎవరూ కనీసం 25 రన్స్ కూడా చేయలేకపోయారు. ముఖ్యంగా హనుమ విహారి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 42 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అతడు ఆచితూచి ఆడాడు. మరో తెలుగు కుర్రాడు తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరోవైపు వెస్ట్ జోన్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. 130 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. మళ్లీ జాతీయ జట్టులోకి రావాలని ఆశిస్తున్న విహారి పట్టుదలతో ఆడాడు. వెస్ట్ జోన్ బౌలర్లలో షామ్స్ ములానీ మూడు వికెట్లు పడగొట్టగా నాగ్వస్వల్లా, చింతన్ గజా, ధర్మేంద్రసింగ్ జడేజా తలో రెండు వికెట్లు సాధించారు.

ఇది కూడా చదవండి: Sarfaraz Khan: అయ్యో.. సర్ఫరాజ్ ఖాన్.. టీమిండియాకు ఎంపిక చేయలేదని బెంగ పెట్టుకున్నావా?

కాగా అనంతరం వెస్ట్ జోన్ బ్యాటింగ్‌కు దిగగా సౌత్ జోన్ బౌలర్లు బెంబేలెత్తించారు. 27 పరుగుల వద్ద కెప్టెన్ ప్రియాంక్ పాంచల్‌ వికెట్ పడగొట్టారు. అయితే మరో ఓపెనర్ పృథ్వీ షా మాత్రం దుమ్మురేగేలా ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నిరాశపరిచిన పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో మాత్రం సాధికారికంగా ఆడాడు. 101 బాల్స్‌లో 9 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. అయితే పృథ్వీ షాను మినహాయిస్తే ఒక్కరూ కూడా రాణించలేకపోయారు. సీనియర్ జట్టులో స్థానం కోల్పోయిన చతేశ్వర్ పుజారా కూడా నిరాశపరిచాడు. అతడు కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. సౌత్ జోన్ బౌలర్లలో విధ్వత్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. విజయ్ కుమార్ వైషాక్ రెండు వికెట్లు పడగొట్టాడు. వెస్ట్ జోన్ ఇంకా 91 పరుగుల వెనుకంజలో ఉంది.

Updated Date - 2023-07-13T20:07:26+05:30 IST